Tuesday, 9 August 2016

నిత్యసత్యం - ముందుమాట



ఓం శివ శివ అరుణాచల శివా శ్రీ శ్రీ శ్రీ భగవాన్ రమణ మహర్షి

ఉపదేశామృతం

ఈ పుస్తకాన్ని2005 లో వ్రాయటం జరిగింది. తిరువన్నామలై ఆశ్రమం వారి అనుమతితో అదే సంవత్సరం దీనిని ముద్రించటం జరిగింది. మచిలీపట్టణంలోని  రమణాశ్రమంవారు నా అనుమతితో పునర్ముద్రించటం జరిగింది.


ఈ పుస్తకాన్ని పంపించమని చాలా మంది కోరటం వలన,
నేను ఈ పుస్తకాన్ని అందరికి అందించలేకపోవటం వలన,
ఈ పుస్తకాన్ని అందరికి అందుబాటులో ఉంచాలన్న ఒకేఒక్క తలంపుతో
దీనిని ఇంటర్నెట్/web లో ఉంచటం జరిగింది.

                                                                         ............అక్బర్ అలీ 


                  



మనవి

                                              మనవి

‘శ్రీ శ్రీ శ్రీ భగవాన్ రమణ మహర్షి యొక్క సందేశాన్ని అందరికీ అందించాలి’ అన్న ఆలోచన నాలో రావటమే భగవాన్ యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను.
నా ఈ చిన్న ప్రచురణ మీ హృదయాలను తాకి, మీ హృదయమనే ఆత్మను మీరు తెలుసుకోగలిగితే, ఈ నా ప్రయత్నం సఫలమైనట్లే. ఇది చదవటం ఎంత తేలికో ఆచరణ అంత కష్టం. అంటే ఆచరణ సాధ్యం కాదని, అందుకోలేనిది కాదని మాత్రం కాదు. దీనిపై పూర్తి ఏకాగ్రత, తెలుసుకోవాలనే తృష్ణ ఉండాలి. నిన్ను నీవు తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. మనం ఆత్మ గౌరవం, ఆత్మ తృప్తి, ఆత్మ విమర్శ ,ఆత్మ హత్య, ఆత్మ క్షోభ, ఆత్మాభిమానం మొదలైనవి మనకు తెలియకుండానే ప్రముఖం చేసి మాట్లాడతాము. అంటే మన దేహాన్ని ఎక్కడా ప్రముఖం చేసి మాట్లాడం. కనుక, అన్నింటికీ మూలమైన ,ఈ ఆది, అంతం లేని ఎప్పుడు నిజమైన నీవుగా ఉండే ఆత్మని తెలుసుకో. మిగిలినదంతా నీకే అవగతమౌతుంది.
ఆశ్రమంలోని వివిధ పుస్తకాలనుండి ఈ విషయాలను సేకరించి, క్రోడీకరించి, అందిస్తున్నాను. ఈ ప్రచురణకు అనుమతి ప్రసాదించిన ఆశ్రమం వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు.

                                                                                  ఒక ఆత్మన్వేషి

                                                                        (అక్బర్ అలీ - 9949096366)

నిత్యసత్యం - 01



ఓం నమో భగవతే శ్రీ రమణాయ

మహర్షి యొక్క ప్రథమ ఉపదేశము:
కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. జరుగనిది ఎవరెంత యత్నించినను జరుగదు. జరుగునది ఎవరెంత అడ్డుపెట్టినను జరుగనే జరుగును. ఇది సత్యము. కనుక మౌనముగా నుండుటయే ఉత్తమము.

- డిసెంబర్ 1898 లో భగవాన్ మౌన ముద్రలో ఉండగా తన తల్లికి కాగితముపై వ్రాసి ఇచ్హినది.

మహర్షి యొక్క ప్రథమ వాణి :
‘నేను’ అను భావము యెందుండి పొడము చున్నదో పరికించిన, మనస్సు అందులో లీనమగును. అదియే తపస్సు. మంత్ర జపమప్పుడు, మంత్ర నాదమెందు ఉద్భవించునో పరికించిన మనస్సు అందులో లీనమవును. అదియే తపస్సు.

- గణపతి ముని తపస్స్వభావము చెప్పమని ప్రార్ధించగా, 11 సంవత్సరముల మౌనము తర్వాత    18-11-1907 న పలికినది.

నిత్యసత్యం - 02



                                                 రమణుల జీవిత ఘట్టాలు


30-12-1879        తిరుచ్చిళి లో వెంకటరామన్ జననం
01-11-1895        అరుణాచలం నామం సోకగానే దివ్యావేశము 
29-08-1896        ఇల్లు వదలుట
01-09-1896        అరుణాచలంలో అడుగు పెట్టుట
01-09-1896        నుండి 18-11-1907 వరకు మౌనం
18-11-1907        న వెంకటరామన్ ను ‘భగవాన్ శ్రీరమణ మహర్షి’ గా గణపతి ముని నామకరణం    చేయుట

14-04-1950        మహా నిర్యాణం 

నిత్యసత్యం - 03


మానవులు సూటిగా సరళంగా ఉన్న సత్యాన్ని గ్రహించలేరు. తమ వద్దనున్న దాని గురించి పట్టించుకోరు. లేనిదాని కోసం ప్రాకులాడుతారు. ఈ సత్యం వారి దైనందిన జీవితానుభవం. ఆత్మను గూర్చిన సత్యం కూడా ఇదే. ఆత్మను ఎరుగనివారు, వివిధ సందర్భాలలో తమకు తెలియకుండానే ఆత్మను మిళితం చేసే మాటలు మాట్లడనివారు లేరు. ఇట్టివారు తమలోనే ఉన్న నిత్యమైన, సత్యమైన, చైతన్యమైన, ఆత్మను తెలుసుకోవటానికి మాత్రం ప్రయత్నించరు. తమ అధీనంలోలేని, ఉన్నదో లేదో తెలీని అతీతమైన, స్వర్గం, నరకం, పునర్జన్మ వంటివన్నీ తెలుసుకోవాలని అతృత చెందుతుంటారు. అంటే సరళమైన సత్యాన్ని కాదని, ఎదో మర్మంగా ఉండేదంటేనే వాళ్లకు ప్రేమ. వారి అభీష్టం మేరకే మతాలు కూడా వంత పాడుతున్నా, చివరకు ఆత్మ విచారానికే అవి మార్గాన్ని చూపుతున్నాయి.
అలాగే మనిషి తన నిజమైన మూలానికి తిరుగు ముఖంపట్టి , నడిచేటట్టు చేసేందుకే శాస్త్రాలన్నీ ఉద్దేశిoబడ్డాయి . అతడు కొత్తగా ఏదీ పొందనక్కర్లేదు. అనుచిత భావాలనూ, పనికి మాలిన సంస్కారరాశిని పరిత్యజించవలసి ఉంది. ఇలా చెయ్యకుండా ఎదో వింతైన, నిగూడమైన దానిని చేజిక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే తప్పు. మినహాయింపన్నదే లేకుండా శాస్త్రాలన్నీ మోక్షం కోసం, మనస్సును లోబరచుకోవలసి ఉంటుందని ఉద్బోధిస్తున్నాయి. అంటే అంతిమ లక్ష్యం మనో నిగ్రహమే అని ఒకసారి తెలిసిన తర్వాత అంతూ పొంతూ లేకుండా శాస్త్రాలను అధ్యయనం చేయటం నిరర్ధకరం. పంచకోశాలలోపల ఉన్న ఆత్మ అనే ‘నేను’ ను కనుగొనటానికి, వాటి వెలుపల ఉన్న శాస్త్రాలను చదవటం వ్యర్థం. నీవు ఎంత మేర తిరిగిననూ, తిరిగి తిరిగి, ఆత్మ వద్దకే రావలసియుంది. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడే ఆత్మనిష్ఠలో ఎందుకు స్థిరంగా ఉండకూడదు. దీనికి కావలసింది ‘నేను ఎవరు’ అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటమే. శాస్త్రాలను అధ్యయనం చేస్తూ పోతే ఈ విధమైన ఆత్మవిచారం ఎలా సాధ్య పడుతుంది? ఆత్మను జ్ఞానచక్షువుతో దర్సిoచాల్సి  ఉంది. మనస్సును సర్వదా అంతర్ముఖంగా ఉంచుతూ , ఆత్మలో లీనమై ఉండటమే ఆత్మ విచారం.

ఆత్మవిచారం సర్వసంగపరిత్యాగికి  మాత్రమే సాధ్యమనుకోవటం తప్పు.  ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి చెంది నది. అది మనస్సులోనే జరగాలి. గృహస్తుడవని నీవెందుకనుకుoటావు. నీవు సన్యాసిగా మారినా అదే తలంపు నిన్ను పట్టి పీడిస్తుంది. నీవు గృహస్తుడవై ఉండి, గృహస్తుడవని అనుకోకుంటే అది సన్యాసమే. కాని  సన్యాసి తాను సన్యాసినని అనుకుంటున్నంత కాలం అతడు సన్యాసి కాలేడు. నీవు గృహస్థాశ్రమంలో ఉన్నా, లేక దాన్ని విడిచి అడవులకు వెళ్ళినా, నీ మనస్సు నిన్ను వేధిస్తూ ఉంటుంది. ఈ తలoపులకు మూలం అహంభావమే. అదే దేహాన్ని, ప్రపంచాన్ని సృష్టించి, నీవు గృహస్తుడవని అనుకునేటట్లు చేస్తుంది. నీవు సన్యసిస్తే, సంసారానికి బదులు సన్యాసానికి సంబంధించిన తలoపులూ, ఇంటికి బదులు అడవికి చెందిన తలoపులూ తెచ్చి  పెడుతుంది. అంటే మానసికమైన ఆటంకం నీకు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అంటే ఉన్న ఏకైక ఆటంకం మనస్సు. అది అతిక్రమించబడాలి. అది అడవిలో సాధ్యమని నీవు అనుకుంటే, అది ఇంట్లో మాత్రం ఎందుకు సాధ్యపడదు. నీవు ఇక్కడ ఉన్నా, అడవికి పోయినా ఒకటే. మనస్సు కదా నీతో ఉండేది. నీ సంసారములోనే జ్ఞానం సంపాదించ గలవు. దానికి సన్యాసం ఎందుకు. సంసారం బాధే కాని, దాంట్లో నుంచి జ్ఞాని కావడం ఎక్కువ సులభం.
ఆత్మ నిష్టుడై ఉంటే, వ్యావహారిక జీవితంలోని కర్తవ్యాలు సవ్యంగా నిర్వహిoచలేమనుకోవటం తప్పు. ఒకే నటుడు, తను ధరించే పాత్రకు తగిన ఆహార్యం ధరించి, నటనలో లీనమవుతాడు. కాని ఆ పాత్ర తాను కాదని, నిజ జీవితంలో తాను వేరే వ్యక్తినని అతనికి తెలుసు. నీవు ఆత్మవని, శరీరానివి కావని, ఒకసారి తెలుసుకున్న పిదప, శరీరం ఏమి చేస్తున్నా, నీ ఆత్మనిష్ఠ చెదరవలసిన పని లేదు. అంటే తన దేహం తాలూకు ఎట్టి  కర్తవ్యాలనైనా సముచితంగా, సమర్థవంతంగా నిర్వహించడాన్ని నీ ఆత్మనిష్ఠ ఎన్నడూ ఆటoక పరచదు .
మనిషి వివాహితుడైనా, అవివాహితుడైనా, ఆత్మానుభూతిని పొందగలడు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. అది నిత్య సిద్ధమైనది. కొత్తగా సంపాదిoచుకోవలసినది కాదు. కొత్తగా సంపాదిoచు కోవలసిన వస్తువు అయితే అటువంటిది అన్వేషిoచటానికి తగదు. అంటే ఏది సహజసిద్ధమైనది కాదో అది శాశ్వతమైనదీ కాదు. అంటే ఆత్మ (ఉండేది,ఉంటున్నది,ఉండబోయేది ) ఇప్పటికిప్పుడు ఉన్నదీ,  ఉన్నది అది మాత్రమే , అనీ తెలుసుకోవాలి.
నేను అను తలంపు పుట్టడమే ఒక వ్యక్తి పుట్టుక. ఈ తలoపు  పుట్టినప్పుడు ‘శరీరమే నేనను’ తాదాత్మ్య భావం బయలు దేరుతుంది. దీనివలన ఇతరులనూ శరీరాలుగానే భావిస్తావు. ఈ శరీరం పుట్టి పెరిగి నశిస్తుంది. ఈ శరీర తలంపు ఉన్నంతవరకు దు:ఖo ఉంటూనే ఉంటుంది. ఈ రూపాన్ని అతిక్రమించి అసలైన ఆత్మను తెలుసుకున్నప్పుడు, నీవు నిత్యమనీ, ఇతరులూ నిత్యమనీ గ్రహిస్తావు. అప్పుడిక జననమూ లేదు మరణమూ లేదు. ఈ రెండూ కలిగేది శరీరానికి మాత్రమే. ఇది అహంభావం యొక్క సృష్టి. దేహం లేకుండా అహంభావం గుర్తించబడదు. ఇది దేహంతో అనన్యభావాన్ని పొంది ఉంటుంది.

సుషుప్తిలో గుర్తింపబడని, శరీరం, ప్రపంచం, జనన మరణాలు, దుఃఖం మొదలైనవి జాగ్రదావస్థలో  ఎందుకు వస్తున్నాయి. ఆత్మ రెండు అవస్థలలోను ఉంది కదా. అంటే మొదటి అవస్థలో లేనిది , రెండవ అవస్థలో ఉన్నది ‘మనస్సు’ ‘ఆలోచనలు’ ‘అహంభావం’.  కాబట్టి, నీవు అంతర్ముఖుడవైతేనే నీవు ఈ జనన మరణ దుఃఖాల నుండి విముక్తుడవవుతావు.

నిత్యసత్యం - 04


నీవొక వ్యక్తివనీ, నీకు వెలుపల విశ్వం ఉన్నదనీ, విశ్వానికి అతీతంగా భగవంతుడున్నాడనే భిన్నత్వ భావన పోవాలి. గీతలో ‘నేనే ఆదిని, మధ్యాన్ని, అంతాన్ని అయి ఉన్నాను. నేను సర్వభూత హృదయాలలోనూ ఉన్నాను.’ అన్నాడు. అతడే అందరికి మూలం, ఆధారం, మరియు అంతము. అందరూ అతని నుండే బయల్వెడి, అతనితోనే ఉండి, అతనితోనే లయిస్తారు. కాబట్టి అతను వేరుగా లేడు . భగవంతుని కార్యకలాపాలలో ఒక దశ వల్ల ఈ విశ్వం వ్యక్తమవుతున్నది. అంతా బ్రహ్మమే. అది అఖండంగానే ఉంటుంది. అతనెప్పుడూ సాక్షాత్కరించే ఉన్నాడు.  
ఆత్మ, బ్రహ్మమే అను శాశ్వత సత్యాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మమును చూసేందుకు, తెలుసుకునేందుకు వీలులేదు. అది ద్రష్ట, దర్శనము, దృశ్యము అను త్రిపుటికి అతీతమైనది. సద్వస్తువు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ‘ బ్రహ్మణ్హోహి  ప్రతిష్టాహ’ అని గీత అంటుంది. ఆ ‘ అహం’ ను తెలుసుకుంటే మొత్తం తెలిసిపోతుంది.
పరమాత్మ తెలియబడకుoడటంగాని, అప్రాప్తంగా ఉండటం గాని ఎప్పుడూ లేదు. ఎందుకంటే, అతను ఏకమై ఉన్నాడు. ఆత్మతో సమానమై ఉన్నాడు. ఆయన అనుగ్రహం, ఆయన దివ్యసాన్నిధ్యంతో సమానం. దీనినే జ్ఞాన ప్రాప్తి అంటారు. నీవు సూర్య కాంతిలో ఉన్నా, సూర్యుణి/న్ని  తెలుసుకోగోరితే నీకళ్ళను సూర్యుని దిశగా మరలించి చూడాలి. అలాగే దైవానుగ్రహం ఇప్పటికిప్పుడు ఉన్నప్పటికీ, స్వప్రయత్నం ద్వారానే తెలుసుకోవాలి. అలాగే, ఒక అజ్ఞానికి నిత్యం స్వయంప్రకాశమానమై ఉన్న ఆత్మ తెలియకుంటే ఆ దోషం ఆత్మదా లేక ఆ అజ్ఞానిదా . అంటే సూర్యుణ్ణి గుడ్లగూబ చూడజాలకుంటే అది సూర్యుడి తప్పా లేక ఆ పక్షియొక్క దృష్టి లోపమా?
పరమేశ్వరుడు శాశ్వత అనుగ్రహమే. కనుక అనుగ్రహాన్ని ప్రసాదిoచటమనే ప్రత్యేక క్రియ ఉండదు. అది సర్వే సర్వత్రా వ్యాపించి ఉంది. ఈశ్వరానుగ్రహం కావాలనుకునే నీ కోరిక సైతం, నీలో ఇప్పటికే పనిచేస్తున్న ఈశ్వరానుగ్రహం వలన కలిగినదే.
విధాత జీవుల ప్రారబ్ధకర్మను, అంటే జన్మంతరాలలో అవశేషించి యుండి, ఈ జీవితకాలంలో అనుభవిoచ వలసియున్న కర్మను అనుసరించి వారి విధిని నిర్ధారిస్తాడు. నీవు ఎంత ప్రయత్నించినా , విధి నిర్ణయానుసారం మాత్రమే జరుగుతుంది. శరీరం చేయవలసిన కార్యకలాపాలన్నీ ఈ లోకంలోకి వచ్చేటప్పుడే నిర్ణయించబడి ఉన్నాయి. వాటిని ఆమోదించటం, తిరస్కరించటం, నీ అధీనంలో లేవు. నీకు ఉన్న స్వేచ్ఛ అంతా మనస్సును అంతర్ముఖంగా చేసుకునే స్థితిలో ఉండటమే. నీవెంత తప్పించుకోవాలన్నా జరుగనున్నది జరిగే తీరుతుంది.
సృష్టికర్త ఒకరు. జీవులంతా సృష్టింపబడిన వారే. ఈ సృష్టించబడిన వారికే స్వేచ్ఛ ఉంటే, సృష్టికర్త సర్వశ క్తిమంతుడు, సర్వజ్ఞుడు కాలేడు.  అంటే ఏమి జరుగబోతున్నదో ఆయనకు తెలియదు. జరుగవలసినవన్నీ ఎవరికి వారు వారి ఇష్టానుసారం మార్చుకోవచ్చు. అoటే తన అదుపులో ఏదీ లేదన్నమాట.

అలాగాక, ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడూ అయితే జరగబోయేదంతా తనకు ముందుగానే తెలుస్తుంది. అంతా తన అదుపులోనే ఉంటుంది. అంటే మనకు నిర్ణయాలు చేసే శక్తి ఉండదు. విధిని జయించాలంటే ఆత్మను గుర్తించాలి. లేదా శరణాగతి పొందాలి. నిజమైన శరణాగతి భగవంతుని ప్రేమకోసం, ప్రేమించటమే గాని వేరే ఎందుకూ కాదు. మోక్షం కూడా అంతే. 

నిత్యసత్యం - 05


ఆత్మ విచారానికి మార్గాలు రెండు.
1.     నేను ఎవరు – సాధన
2.     శరణాగతి
1.     నేను ఎవడను :
సప్తధాతువులచే ఏర్పడిన ఈ స్థూలదేహము గాని
పంచ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములు గాని
ప్రాణాది వాయు సంచకములు గాని, మనస్సుగాని
ఇవేవీ నేను కాదు. ఇవన్నీ జడములే.
అంటే మనము వేటిని  చూసి ‘నేను’ అని భ్రమ పడుతున్నామో అవి నేను కాదు. మరి ‘నేను ఎవడను?’.  
ఇవన్నియు కాని, ఏకసద్రూపమైన జ్ఞానము, చైతన్యమూ అయినది, ప్రత్యేకమైనది అయిన, ‘ఆత్మ’ యే నేను.
దీని రూపమేదియని తెలిసికొనినపుడు , తానే  గొప్పదియు, జ్ఞానమే స్వరూపము కలదియు, తుది లేనిదియు, ఆది కానరానిదియు , అఖండపరిపూర్ణంబైన సుఖస్వరూపమని తెలియును.
‘అనంతాద్యఖండచిత్ సుఖంబే తాను’.  ఆత్మైక్యానుభూతి వలననే ఆత్మనిష్ఠ కలుగుచున్నది. అట్టి తన్మయనిష్ఠలో , తాను రెండుగా భాసిoచుట ఎట్లు సాధ్యం? నిష్టానుభూతిలో జీవేశ్వర భేదము పూర్తిగా పోవును. జీవేశ్వరులిద్దరును  సత్స్వరూపులై ఉండుటచే ఏకవస్తువై ఉన్నారు.
ఎక్కడైతే ‘నేను’ అను జీవ అహంభావం నశిస్తుందో , అక్కడ అఖండ పరిపూర్ణంబగు పరమాత్మ స్వయముగా‘నేను-నేను’ అంటూ వెలుగుతూ ఉంటుంది. అంటే ‘ఆహమిదం – ఆహమిదం’ అను చిన్న జీవభావము పోయి , ‘అహం-అహం’ అను, అఖండ – ఆత్మభావము ప్రకాశిస్తుంది .మనస్సు అనే వస్తువు ప్రత్యేకంగా లేదు. అది ఆత్మ నుంచి వచ్చిన ఒక ‘కాంతి’. అది ఆత్మ స్వరూపము నందున్న ఒక అతిశయ శక్తి. ఈ మనస్సునుoడియే అన్ని తలంపులు  వస్తున్నాయి. కనుక తలంపులే మనస్సు యొక్క స్వభావము. వీటిని త్రోసివేసినపుడు ‘ఆత్మ’ స్వరూపం దర్శ  నమిస్తుంది.

మనస్సు లెక్కలేనన్ని తలంపులతో విరియుటచే ఒక్కొక్క తలంపు అతి బలహీనంగా ఉంటుంది. ఈ తలంపులను పూర్తిగా కొనసాగించక, ఒక్కొక్క తలంపు కల్గిన వెంటనే ‘ఈ తలంపు ఎవరికి కల్గినది’ అని ప్రశ్నిoచుకో. ‘నాకు’ అన్న జవాబు వస్తుంది. అప్పుడు ‘నేను ఎవడను’ అని ప్రశ్నిoచుకుంటూ , ఒక్కొక్క తలంపుని నాశనం చేస్తూ పోయిన యెడల, అంతర్ముఖుడవై ఆత్మ లోనికి ప్రవేశిస్తున్నావని కనుగొంటావు. అంటే తలంపులు తొలగి, మనస్సు తాను పుట్టిన చోటికి మరలి వస్తుంది. ఈ అభ్యాసము చేయగా చేయగా, మనస్సునకు తన జన్మస్థానమందు నిలిచి యుండు శక్తి అధికమవుతూ వస్తుంది. అప్పుడు ఇతర తలంపులను అడ్డగించ ప్రయత్నమక్కర్లేదు. అవి వాటంతటవే అంతర్ధానమమవుతాయి.
కూర వండేటప్పుడు మూత పెట్టాలి. అప్పుడే ఆవిరి అణుగుతుంది. కూర పక్వమై రుచిని పడి, తినడానికి యోగ్యమవుతుంది. అలాగే మన మనస్సుకి మూత వేస్తే వృత్తులు అణుగుతాయి. మనిషి జ్ఞానియై, ఈశ్వరుడితో లయిoచటానికి సిద్ధమవుతాడు.  
స్వయంకృషి వలననే అంతరాత్మను చేరగలము. ఒక్కసారి చేరిన పిదప నీవేది చేసినను, ఆత్మ చేతనే. నీకందులో నిమిత్తము లేదు. ఆత్మాన్వేషణ తగినంత అభివృద్ధి చెంది పరిపక్వ దశకు చేరినపుడు, ఆ ఆత్మయే నీకు చేయూతనిచ్చి  లోనికి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ‘నిన్ను నీవు తెలుసుకోవలెనను బుద్ది’ కలగటమే, ఈశ్వర అనుగ్రహమునకు గుర్తు. నీలో ప్రకాశించుచున్న అంతరాత్మ, నిన్ను లోపలికి రమ్మని పిలుస్తున్నది. కేవలం నీవు వెలుపలి నుండి లోపలికి పోవుటకు ప్రయత్నించవలెను. అట్టి ఆత్మను కనుగొనిన యెడల, ఈ ప్రపంచమునకు అంతయూ ఆత్మయై వెలుగు ఏకైక వస్తువును కనుగొనిన వాడవవుతావు.
ఆత్మ అనగా అహంభావము, జీవుడు, దేహము కాదు.

పరమాత్మ అనగా అశాశ్వత మగు జీవునకంటే పరమైన పరాపర వస్తు తత్వము.