జ్ఞాని
“తెరలేకుండా బొమ్మలు లేవని” తెలుసుకుంటే “చూచేవాడు లేకుండా చూడబడేది లేదు”
అని తెలుసుకుంటే, ఎవరూ భ్రమచెందరు. జ్ఞానికి బొమ్మలూ, తెరా రెండూ ఆత్మేనని తెలుసు.
జ్ఞానికి వచ్చే కలలు, కలలే అని తెలుస్తుంది. మెలకువగా ఉన్నప్పుడు కూడా, అదీ ఒక
కలేనని భావించినట్లే, అదీను. అంటే, జ్ఞాని
తురీయావస్థలో, అంటే పరమ సత్యంలో సంస్థితమవుతాడు. అంటే వాస్తవానికి ఉండేది
తురీయావస్థ. మిగిలిన మూడూ ఉన్నట్లే అనిపించినా అవి లేవు. ఒక జ్ఞాని కర్మాచరణలో
ఉన్నప్పుడు, అతని మనస్సు ఆత్మనిష్ఠలో ఉంటుంది.కనుక అతను చేసే పని అతనిని
కలవరపెట్టదు .
జ్ఞానికి దేహాత్మ బుద్ధీ
ఉంటుంది. కాకపోతే, ఇదంతా ఆత్మే, బ్రహ్మమే అనుకుంటాడు. నొప్పి ఉంటే ఉండనీ, అది కూడా
ఆత్మలో భాగమే. ఆత్మ పరిపూర్ణం. దేహాత్మ బుద్దిని దాటిన తర్వాత ఎవరై నా జ్ఞాని
అవుతారు. ఆ బుద్ధి లేకపోతే క కర్తృత్వమూ లేదు, కర్తా లేడు. అందువల్ల జ్ఞానికి కర్మ
లేదు. (అంటే ఏ కార్యమూ చేయడు )
సర్వాన్ని ఆత్మగా గ్రహించటమే వాస్తవికం. ఆత్మదృష్ట జగత్తులోనూ ఆత్మనే దర్శిస్తాడు. జగత్తు
కనిపిస్తున్నదా లేదా అనేది జ్ఞానిదృష్టిలో
ఏ మాత్రం ముఖ్యం కాదు. ఎల్లప్పుడూ అతని ధ్యాస
ఆత్మాభిముఖం గానే ఉంటుంది. అక్షరాలకు
వ్రాయబడే కాగితాలకు ఉన్న సంబంధం లాంటిదే ఇది కూడా. అక్షరాలపై దృష్టి లగ్నం
చేసి, దానికి ఆధారమైన కాగితాన్నే నీవు విస్మరిస్తావు. కాని జ్ఞాని అలా గాక
అక్షరాలు ఉన్నప్పుడూ అవి లేనప్పుడూ కూడా ,
కాగితాన్నే ఆధార వస్తువుగా గ్రహిస్తాడు.
జీవించటానికి పనులు చేయటానికి మనస్సు అవసరముం ది. కాని మనస్సు యొక్క
ప్రమేయం లేకుండానే జ్ఞాని ఈ రెండు పనులను చేస్తాడు. కుండ తయారు కాగానే కుమ్మరి
చక్రాన్ని తిప్పడం మానుకుంటాడు. కాని చక్రం మాత్రం ఇంకా తిరుగుతుంది. శరీరం
జన్మించటానికి కారణమైన ప్రారబ్ద కర్మ , శరీరమేయే పనులు చేయాలో దానితో చేయిస్తుంది.
ఈ పనులన్నీ చేస్తున్నా, జ్ఞాని మాత్రం తాను కర్తనని అనుకోడు.
మనుష్యుల యొక్క వైరుధ్యములూ , వైవిధ్యములూ ఉపరితలాన కనబడేవి గానే
చూస్తాడు. వాటికి సంస్థితమైన ఒకే ఒక సత్యానికి ఏ భేదమూ లేదని గమనిస్తాడు. అలాగే
అతనికి అభిమాన పాత్రమయిన రుచులంటూ ఉండవు. వాటి వ్యత్యాసాలను గమనిస్తాడు కాని
అన్నింటిలో ఒకే ఒక సత్యాన్ని చూస్తాడు. అతడు కదిలినా, మాట్లాడినా, ఏదైనా చేసినా
కూడా, అతని చేష్టలన్నీ ఒకే ఒక సత్యం లోనివే.
మంచి వారి పట్ల ఆప్యాయత , నిస్సహాయుల పట్ల దయా, మoచి పనులు చేయటంలో
ఆనందం, దుష్టుల పట్ల క్షమా, ఇవన్నీ జ్ఞానికి సహజ లక్షణాలు.
జ్ఞాని ఏ అనురక్తి లేకుండా ఏ విధంగా ప్రభావితం కాకుండా ఇతరుల కోసం
పనులు చేస్తాడు. ఏడ్చేవా ళ్ళతో ఏడుస్తాడు. నవ్వే వాళ్ళతో నవ్వుతాడు. అడేవాళ్ళా/తో
ఆడుతాడు . పాడేవాళ్ళాతో / పాడుతాడు .
అతని ఉనికి నిర్మలమైన ,శుభ్రమైన అద్దం వంటిది. ఒక సంఘటన అయిపోయిన
తర్వాత దాని గురించి ఆలోచించడు జ్ఞాని. అంటే అతని మనస్సుపై ఏ ముద్రా వేయదు. అంటే
దానివల్ల ఏ ప్రభావమూ ఉండదన్న మాట. గురువు/జ్ఞాని చుట్టూ ఉండి వారిని సేవించుకునే
భక్తులకు ఎదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుందని అందరూ అనుకుంటారు. అట్లాంటి
ప్రత్యేకత ఉంటే అ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు. లోకంలో ఎక్కడ ఎంత దూరాన ఉంటేనేం,
ఎవరు గురువుకు తాను సంపూర్ణంగా అర్పించుకుo టాడో , ఎవడు సమస్తమూ గురువేనని ,
తానేమీ కాదనీ, తన అహంకారాన్ని విసర్జిస్తాడో, అట్లాంటి అతనిని ఉద్ధరించటం
గురువు/ఈశ్వరుని విధి. అట్లా అర్పించుకున్నవాడు ఏ ప్రార్ధనా చేయనక్కరలేదు.
ఈశ్వరుడే పరుగెత్తుకుని వచ్చి సదా అతని వెంట ఉంటాడు. పద్మం పక్కన కప్పు నివసిస్తూ
ఉంటుంది. ఏ దూరన్నుంచో తుమ్మెద వచ్చి మకరందం తాగిపోతుంది.
భగవంతుడు, ఆత్మ, హృదయం, చైతన్య స్థావరం, ఈ పేర్లన్నీ ఒక్కటే. హృదయమే
మనిషి అంతరాంతరం. అదే కేంద్రం. అది భౌతికం కాదు.
“హృత్ – అయం” అంటే “ఇది కేంద్రం” అని అర్ధం. ఇక్కడ నుండే అన్ని భావాలు
ఉదయించి , దాని మీదే ఆధారపడి , దానిలోనే
లయమైపోతాయి.మనస్సు భావాల సమూహం. భావాలే ప్రపంచానికి రూపాన్నిచ్చాయి .
బ్రహ్మం నుండే జీవులన్నీ ఉద్భవిస్తాయని ఉపనిష త్తులు చెప్తాయి. అదే హృదయం.
బ్రహ్మమే హృదయం.
మనకు కావలసిందల్లా , ఆత్మసాక్షాత్కారం కాలేదన్న భావాన్ని
తొలగించుకోవటమే. మనమెప్పుడూ ఆత్మే. ఎటోచ్చీ
మనం ఆ విషయాన్ని గ్రహించం . మనస్సణగితే , ప్రపంచమూ అణగిపోతుంది. అంతటికీ మూలకారణం
మనస్సే. అది అణగితే సహజస్థితి ప్రకటితమవుతుంది. ఆత్మ ఎప్పుడూ “అహం-అహం” అంటూనే
ఉంటుంది. అది స్వయం ప్రకాశం. మనం దానిలోనే ఉన్నాం. అందులోనే ఉంటూ దానికోసం వెతకటం
దేనికి? “దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే ప్రపంచమంతా బ్రహ్మం గా గోచరిస్తుందని
‘. మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు.
No comments:
Post a Comment