Tuesday, 9 August 2016

నిత్యసత్యం - 12

ఆత్మ
ఈశ్వరుని లేక ఆత్మను చేరటానికి తీవ్రంగా యత్నించే మనిషికి ఏ సిద్ధాంతమూ అవసరం లేదు. ప్రతి వ్యక్తీ ఆత్మే. వాస్తవంగా అనంతమే. కాని ప్రతివాడు తన శరీరాన్ని ఆత్మగా భ్రమిస్తాడు. దేన్ని గ్రహించాలన్నా వెలుతురు ఉండాలి. ఇది జ్యోతి (ఆత్మ) యొక్క స్వరూపానికి చెందినదిగానే ఉండగలదు. అది భౌతికమైన వెలుగునూ, భౌతికమైన చీకటిని కూడా ప్రకాశిoపజేసేదై యుండాలి . అంటే మనకు కనిపించే వేలుగుకూ ,చీకటికీ అతీతంగా ఉంటుందన్నమాట. తానై వెలుగూ కాదు. తానై చీకటీ కాదు . కాని అది ప్రకాసాన్నందిస్తున్న కారణంగా “జ్యోతి” అనబడుతుంది. అది అనంతము మరియు చైతన్యము. ప్రతి వారికీ తెలిసియున్న చైతన్యమే ఆత్మ. ఏ ఒక్కరూ ఆత్మకు దూరంగా ఉండలేరు . కాబట్టి వాస్తవంలో ప్రతివాడూ ఆత్మజ్ఞానియే. విచిత్రమేమిటంటే జనానికి ఈ విషయం తెలియనందువల్ల వారు ఆత్మను తెలుసుకోవాలని వాంఛిస్తారు.  
సుఖం
సుఖమనునది ఆత్మ స్వరూపము. ఇవి రెండూ వేరు కావు  .ప్రపంచమునందున్న ఒక్క వస్తువులోను సుఖము లేదు. మనం అవివేకంతో వాటివలన సుఖం కలుగుతుందని తలుస్తాము. మనస్సు ఆత్మ నుండి బయటకు పోవునపుడు దుఃఖం అనుభవిస్తుంది. వాస్తవమున మన కోరికలు తీరినపుడెల్ల మనస్సు యథా స్థానమునకు మరలి ఆత్మ సుఖమునే అనుభావిo చుచున్నది. ఈ విధంగా మనస్సు ఆత్మను వదలి బయటకు లోపలికి చరిస్తూ ఉంటుంది. అంటే నీడలో నుండి ఎండకు, ఎండలోనుండి నీడకు వచ్చుచున్నట్లు. కొంతసేపు అటు, కొంతసేపు ఇటు వచ్చువాడు అవివేకి. వివేకి ఎప్పుడూ నీడను విడిచిపోడు. అంటే జగత్తు ఉన్నప్పుడు దుఃఖం,  అది లేనప్పుడు, మనస్సు, ఆనందాన్ని అనుభవిస్తుంది.
మాయ

భగవంతుని స్వశక్తి వల్లనే సృష్టి జరిగింది. జగత్తు అంతా మాయ అంటాం. అసలు మాయే మాయ కదా. దానిని ఎవరైనా వెలుపలినుండి కదా చూడాలి. అటువంటప్పుడు మాయలోని తారతమ్యాలను ఎలా గుర్తించగలం. జగత్తు ఒక దృగ్విషయం . ఈ దృశ్యమాన జగత్తు ఏ మార్పు చెందనట్టి ఒక ఏకైక సత్య వస్తువు యొక్క సత్తాపై ఆధారపడి ఉన్నది. జగద్వ్యవహారంలో మునిగి ఉన్నావు కాబట్టి ఈ జగత్తు నీకు సత్యంగానే గోచరిస్తుంది. జగత్తుకు అతీతంగా పో. అపుడది మాయమై, సత్యమొక్కటే నిలుస్తుంది. మనస్సు బహిర్ముఖమై ఉన్నప్పుడు జగత్తు యొక్క ఉనికి , బాహ్యమైన వస్తువుగానే గోచరిస్తుంది. అట్టి సమయంలో మనస్సు ఆత్మలో తన అనన్యాత్మకతను పోగొట్టుకుంటుంది.

No comments:

Post a Comment