Tuesday, 9 August 2016

నిత్యసత్యం - 10

చైతన్యానికి మెలుకువ జోడిస్తే జాగ్రదావస్థ
చైతన్యానికి నిద్ర జోడిస్తే సుషుప్తి
చైతన్యానికి కల జోడిస్తే స్వప్నం
నిజానికి స్వప్నావస్థకీ, జాగ్రదావస్థకీ, తేడా ఏమీ లేదు. స్వప్నావస్థ చిన్నది.జాగ్రదావస్థ పెద్దది. రెండూ మనస్సుకి ఫలితాలే. జాగ్రదావస్థ ఎక్కువ కాలముంటుంది. కాబట్టి అదే నిజస్థితి అని ఊహించుకుంటాం . కాని అసలు నిజస్థితి ఆత్మయొక్క సహజ స్థితి. ఈ అవస్థలు వస్తూపోతూ ఉంటాయని ఆత్మ అంటోందా. అవి వస్తూ పోతూ ఉన్నాయనేది ద్రష్టే.  ద్రష్టా, దృశ్యము  కలిస్తే మనస్సవుతుంది.  అసలు మనసంటూ  ఏదైనా ఉన్నదేమో గమనించు. మనస్సు ఆత్మలో లీనమైనపుడు ద్రష్టా లేడు దృశ్యమూ  లేదు. అంటే ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. దీని గురించి ఎంత విడమర్చి చెప్పినా, ఆత్మ సాక్షాత్కారమయ్యే వరకు సత్యం తేట తెల్లం కాదు. అది జరిగిన తర్వాత ఇంతకాలమూ స్పష్టంగా ఎల్లవేళలా ఉండే దానిని ఎట్లా చూడలేకపోయానా అని ఆశ్చర్యం కలుగుతుంది.
“నేను ఈ దేహాన్ని” అని అంగీకరిస్తే, ఆత్మలు అనేకం. ఈ భావం మాయమైపోయే స్థితిలో ఉండేదే ఆత్మ. ఆ స్థితిలో వేరే వస్తుజాలమంటూ ఏమీ లేదు. ఈ కారణం వల్ల ఆత్మ ఒక్కటే అని అంటాం. ఆత్మ యొక్క సహజ స్థితిలో దేహం, మనస్సు, లోకం లేవు.
ఆత్మను తెలుసుకోవలసిందెవరు? జడపదార్ధమైన శరీరం తెలుసుకోగాలదా? నువ్వు శరీరం కాదు కదా. నువ్వు ఆత్మవి. దీనిని గుర్తించక పోవటం వలననే శాస్త్రాలు మాయలు, లీలలు చెప్తున్నాయి.

రకరకాల నగలలో ఉన్న బంగారాన్ని అంచనా వేసే కంసాలి, వాటిలో ఉన్న బంగారాన్ని తప్ప దేనిని పట్టించుకోడు. అలాగే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆత్మను తప్ప దేనినీ చూడడు.

No comments:

Post a Comment