Tuesday, 9 August 2016

నిత్యసత్యం - ముందుమాట



ఓం శివ శివ అరుణాచల శివా శ్రీ శ్రీ శ్రీ భగవాన్ రమణ మహర్షి

ఉపదేశామృతం

ఈ పుస్తకాన్ని2005 లో వ్రాయటం జరిగింది. తిరువన్నామలై ఆశ్రమం వారి అనుమతితో అదే సంవత్సరం దీనిని ముద్రించటం జరిగింది. మచిలీపట్టణంలోని  రమణాశ్రమంవారు నా అనుమతితో పునర్ముద్రించటం జరిగింది.


ఈ పుస్తకాన్ని పంపించమని చాలా మంది కోరటం వలన,
నేను ఈ పుస్తకాన్ని అందరికి అందించలేకపోవటం వలన,
ఈ పుస్తకాన్ని అందరికి అందుబాటులో ఉంచాలన్న ఒకేఒక్క తలంపుతో
దీనిని ఇంటర్నెట్/web లో ఉంచటం జరిగింది.

                                                                         ............అక్బర్ అలీ 


                  



మనవి

                                              మనవి

‘శ్రీ శ్రీ శ్రీ భగవాన్ రమణ మహర్షి యొక్క సందేశాన్ని అందరికీ అందించాలి’ అన్న ఆలోచన నాలో రావటమే భగవాన్ యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను.
నా ఈ చిన్న ప్రచురణ మీ హృదయాలను తాకి, మీ హృదయమనే ఆత్మను మీరు తెలుసుకోగలిగితే, ఈ నా ప్రయత్నం సఫలమైనట్లే. ఇది చదవటం ఎంత తేలికో ఆచరణ అంత కష్టం. అంటే ఆచరణ సాధ్యం కాదని, అందుకోలేనిది కాదని మాత్రం కాదు. దీనిపై పూర్తి ఏకాగ్రత, తెలుసుకోవాలనే తృష్ణ ఉండాలి. నిన్ను నీవు తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. మనం ఆత్మ గౌరవం, ఆత్మ తృప్తి, ఆత్మ విమర్శ ,ఆత్మ హత్య, ఆత్మ క్షోభ, ఆత్మాభిమానం మొదలైనవి మనకు తెలియకుండానే ప్రముఖం చేసి మాట్లాడతాము. అంటే మన దేహాన్ని ఎక్కడా ప్రముఖం చేసి మాట్లాడం. కనుక, అన్నింటికీ మూలమైన ,ఈ ఆది, అంతం లేని ఎప్పుడు నిజమైన నీవుగా ఉండే ఆత్మని తెలుసుకో. మిగిలినదంతా నీకే అవగతమౌతుంది.
ఆశ్రమంలోని వివిధ పుస్తకాలనుండి ఈ విషయాలను సేకరించి, క్రోడీకరించి, అందిస్తున్నాను. ఈ ప్రచురణకు అనుమతి ప్రసాదించిన ఆశ్రమం వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు.

                                                                                  ఒక ఆత్మన్వేషి

                                                                        (అక్బర్ అలీ - 9949096366)

నిత్యసత్యం - 01



ఓం నమో భగవతే శ్రీ రమణాయ

మహర్షి యొక్క ప్రథమ ఉపదేశము:
కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. జరుగనిది ఎవరెంత యత్నించినను జరుగదు. జరుగునది ఎవరెంత అడ్డుపెట్టినను జరుగనే జరుగును. ఇది సత్యము. కనుక మౌనముగా నుండుటయే ఉత్తమము.

- డిసెంబర్ 1898 లో భగవాన్ మౌన ముద్రలో ఉండగా తన తల్లికి కాగితముపై వ్రాసి ఇచ్హినది.

మహర్షి యొక్క ప్రథమ వాణి :
‘నేను’ అను భావము యెందుండి పొడము చున్నదో పరికించిన, మనస్సు అందులో లీనమగును. అదియే తపస్సు. మంత్ర జపమప్పుడు, మంత్ర నాదమెందు ఉద్భవించునో పరికించిన మనస్సు అందులో లీనమవును. అదియే తపస్సు.

- గణపతి ముని తపస్స్వభావము చెప్పమని ప్రార్ధించగా, 11 సంవత్సరముల మౌనము తర్వాత    18-11-1907 న పలికినది.

నిత్యసత్యం - 02



                                                 రమణుల జీవిత ఘట్టాలు


30-12-1879        తిరుచ్చిళి లో వెంకటరామన్ జననం
01-11-1895        అరుణాచలం నామం సోకగానే దివ్యావేశము 
29-08-1896        ఇల్లు వదలుట
01-09-1896        అరుణాచలంలో అడుగు పెట్టుట
01-09-1896        నుండి 18-11-1907 వరకు మౌనం
18-11-1907        న వెంకటరామన్ ను ‘భగవాన్ శ్రీరమణ మహర్షి’ గా గణపతి ముని నామకరణం    చేయుట

14-04-1950        మహా నిర్యాణం 

నిత్యసత్యం - 03


మానవులు సూటిగా సరళంగా ఉన్న సత్యాన్ని గ్రహించలేరు. తమ వద్దనున్న దాని గురించి పట్టించుకోరు. లేనిదాని కోసం ప్రాకులాడుతారు. ఈ సత్యం వారి దైనందిన జీవితానుభవం. ఆత్మను గూర్చిన సత్యం కూడా ఇదే. ఆత్మను ఎరుగనివారు, వివిధ సందర్భాలలో తమకు తెలియకుండానే ఆత్మను మిళితం చేసే మాటలు మాట్లడనివారు లేరు. ఇట్టివారు తమలోనే ఉన్న నిత్యమైన, సత్యమైన, చైతన్యమైన, ఆత్మను తెలుసుకోవటానికి మాత్రం ప్రయత్నించరు. తమ అధీనంలోలేని, ఉన్నదో లేదో తెలీని అతీతమైన, స్వర్గం, నరకం, పునర్జన్మ వంటివన్నీ తెలుసుకోవాలని అతృత చెందుతుంటారు. అంటే సరళమైన సత్యాన్ని కాదని, ఎదో మర్మంగా ఉండేదంటేనే వాళ్లకు ప్రేమ. వారి అభీష్టం మేరకే మతాలు కూడా వంత పాడుతున్నా, చివరకు ఆత్మ విచారానికే అవి మార్గాన్ని చూపుతున్నాయి.
అలాగే మనిషి తన నిజమైన మూలానికి తిరుగు ముఖంపట్టి , నడిచేటట్టు చేసేందుకే శాస్త్రాలన్నీ ఉద్దేశిoబడ్డాయి . అతడు కొత్తగా ఏదీ పొందనక్కర్లేదు. అనుచిత భావాలనూ, పనికి మాలిన సంస్కారరాశిని పరిత్యజించవలసి ఉంది. ఇలా చెయ్యకుండా ఎదో వింతైన, నిగూడమైన దానిని చేజిక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే తప్పు. మినహాయింపన్నదే లేకుండా శాస్త్రాలన్నీ మోక్షం కోసం, మనస్సును లోబరచుకోవలసి ఉంటుందని ఉద్బోధిస్తున్నాయి. అంటే అంతిమ లక్ష్యం మనో నిగ్రహమే అని ఒకసారి తెలిసిన తర్వాత అంతూ పొంతూ లేకుండా శాస్త్రాలను అధ్యయనం చేయటం నిరర్ధకరం. పంచకోశాలలోపల ఉన్న ఆత్మ అనే ‘నేను’ ను కనుగొనటానికి, వాటి వెలుపల ఉన్న శాస్త్రాలను చదవటం వ్యర్థం. నీవు ఎంత మేర తిరిగిననూ, తిరిగి తిరిగి, ఆత్మ వద్దకే రావలసియుంది. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడే ఆత్మనిష్ఠలో ఎందుకు స్థిరంగా ఉండకూడదు. దీనికి కావలసింది ‘నేను ఎవరు’ అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటమే. శాస్త్రాలను అధ్యయనం చేస్తూ పోతే ఈ విధమైన ఆత్మవిచారం ఎలా సాధ్య పడుతుంది? ఆత్మను జ్ఞానచక్షువుతో దర్సిoచాల్సి  ఉంది. మనస్సును సర్వదా అంతర్ముఖంగా ఉంచుతూ , ఆత్మలో లీనమై ఉండటమే ఆత్మ విచారం.

ఆత్మవిచారం సర్వసంగపరిత్యాగికి  మాత్రమే సాధ్యమనుకోవటం తప్పు.  ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి చెంది నది. అది మనస్సులోనే జరగాలి. గృహస్తుడవని నీవెందుకనుకుoటావు. నీవు సన్యాసిగా మారినా అదే తలంపు నిన్ను పట్టి పీడిస్తుంది. నీవు గృహస్తుడవై ఉండి, గృహస్తుడవని అనుకోకుంటే అది సన్యాసమే. కాని  సన్యాసి తాను సన్యాసినని అనుకుంటున్నంత కాలం అతడు సన్యాసి కాలేడు. నీవు గృహస్థాశ్రమంలో ఉన్నా, లేక దాన్ని విడిచి అడవులకు వెళ్ళినా, నీ మనస్సు నిన్ను వేధిస్తూ ఉంటుంది. ఈ తలoపులకు మూలం అహంభావమే. అదే దేహాన్ని, ప్రపంచాన్ని సృష్టించి, నీవు గృహస్తుడవని అనుకునేటట్లు చేస్తుంది. నీవు సన్యసిస్తే, సంసారానికి బదులు సన్యాసానికి సంబంధించిన తలoపులూ, ఇంటికి బదులు అడవికి చెందిన తలoపులూ తెచ్చి  పెడుతుంది. అంటే మానసికమైన ఆటంకం నీకు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అంటే ఉన్న ఏకైక ఆటంకం మనస్సు. అది అతిక్రమించబడాలి. అది అడవిలో సాధ్యమని నీవు అనుకుంటే, అది ఇంట్లో మాత్రం ఎందుకు సాధ్యపడదు. నీవు ఇక్కడ ఉన్నా, అడవికి పోయినా ఒకటే. మనస్సు కదా నీతో ఉండేది. నీ సంసారములోనే జ్ఞానం సంపాదించ గలవు. దానికి సన్యాసం ఎందుకు. సంసారం బాధే కాని, దాంట్లో నుంచి జ్ఞాని కావడం ఎక్కువ సులభం.
ఆత్మ నిష్టుడై ఉంటే, వ్యావహారిక జీవితంలోని కర్తవ్యాలు సవ్యంగా నిర్వహిoచలేమనుకోవటం తప్పు. ఒకే నటుడు, తను ధరించే పాత్రకు తగిన ఆహార్యం ధరించి, నటనలో లీనమవుతాడు. కాని ఆ పాత్ర తాను కాదని, నిజ జీవితంలో తాను వేరే వ్యక్తినని అతనికి తెలుసు. నీవు ఆత్మవని, శరీరానివి కావని, ఒకసారి తెలుసుకున్న పిదప, శరీరం ఏమి చేస్తున్నా, నీ ఆత్మనిష్ఠ చెదరవలసిన పని లేదు. అంటే తన దేహం తాలూకు ఎట్టి  కర్తవ్యాలనైనా సముచితంగా, సమర్థవంతంగా నిర్వహించడాన్ని నీ ఆత్మనిష్ఠ ఎన్నడూ ఆటoక పరచదు .
మనిషి వివాహితుడైనా, అవివాహితుడైనా, ఆత్మానుభూతిని పొందగలడు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. అది నిత్య సిద్ధమైనది. కొత్తగా సంపాదిoచుకోవలసినది కాదు. కొత్తగా సంపాదిoచు కోవలసిన వస్తువు అయితే అటువంటిది అన్వేషిoచటానికి తగదు. అంటే ఏది సహజసిద్ధమైనది కాదో అది శాశ్వతమైనదీ కాదు. అంటే ఆత్మ (ఉండేది,ఉంటున్నది,ఉండబోయేది ) ఇప్పటికిప్పుడు ఉన్నదీ,  ఉన్నది అది మాత్రమే , అనీ తెలుసుకోవాలి.
నేను అను తలంపు పుట్టడమే ఒక వ్యక్తి పుట్టుక. ఈ తలoపు  పుట్టినప్పుడు ‘శరీరమే నేనను’ తాదాత్మ్య భావం బయలు దేరుతుంది. దీనివలన ఇతరులనూ శరీరాలుగానే భావిస్తావు. ఈ శరీరం పుట్టి పెరిగి నశిస్తుంది. ఈ శరీర తలంపు ఉన్నంతవరకు దు:ఖo ఉంటూనే ఉంటుంది. ఈ రూపాన్ని అతిక్రమించి అసలైన ఆత్మను తెలుసుకున్నప్పుడు, నీవు నిత్యమనీ, ఇతరులూ నిత్యమనీ గ్రహిస్తావు. అప్పుడిక జననమూ లేదు మరణమూ లేదు. ఈ రెండూ కలిగేది శరీరానికి మాత్రమే. ఇది అహంభావం యొక్క సృష్టి. దేహం లేకుండా అహంభావం గుర్తించబడదు. ఇది దేహంతో అనన్యభావాన్ని పొంది ఉంటుంది.

సుషుప్తిలో గుర్తింపబడని, శరీరం, ప్రపంచం, జనన మరణాలు, దుఃఖం మొదలైనవి జాగ్రదావస్థలో  ఎందుకు వస్తున్నాయి. ఆత్మ రెండు అవస్థలలోను ఉంది కదా. అంటే మొదటి అవస్థలో లేనిది , రెండవ అవస్థలో ఉన్నది ‘మనస్సు’ ‘ఆలోచనలు’ ‘అహంభావం’.  కాబట్టి, నీవు అంతర్ముఖుడవైతేనే నీవు ఈ జనన మరణ దుఃఖాల నుండి విముక్తుడవవుతావు.

నిత్యసత్యం - 04


నీవొక వ్యక్తివనీ, నీకు వెలుపల విశ్వం ఉన్నదనీ, విశ్వానికి అతీతంగా భగవంతుడున్నాడనే భిన్నత్వ భావన పోవాలి. గీతలో ‘నేనే ఆదిని, మధ్యాన్ని, అంతాన్ని అయి ఉన్నాను. నేను సర్వభూత హృదయాలలోనూ ఉన్నాను.’ అన్నాడు. అతడే అందరికి మూలం, ఆధారం, మరియు అంతము. అందరూ అతని నుండే బయల్వెడి, అతనితోనే ఉండి, అతనితోనే లయిస్తారు. కాబట్టి అతను వేరుగా లేడు . భగవంతుని కార్యకలాపాలలో ఒక దశ వల్ల ఈ విశ్వం వ్యక్తమవుతున్నది. అంతా బ్రహ్మమే. అది అఖండంగానే ఉంటుంది. అతనెప్పుడూ సాక్షాత్కరించే ఉన్నాడు.  
ఆత్మ, బ్రహ్మమే అను శాశ్వత సత్యాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మమును చూసేందుకు, తెలుసుకునేందుకు వీలులేదు. అది ద్రష్ట, దర్శనము, దృశ్యము అను త్రిపుటికి అతీతమైనది. సద్వస్తువు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ‘ బ్రహ్మణ్హోహి  ప్రతిష్టాహ’ అని గీత అంటుంది. ఆ ‘ అహం’ ను తెలుసుకుంటే మొత్తం తెలిసిపోతుంది.
పరమాత్మ తెలియబడకుoడటంగాని, అప్రాప్తంగా ఉండటం గాని ఎప్పుడూ లేదు. ఎందుకంటే, అతను ఏకమై ఉన్నాడు. ఆత్మతో సమానమై ఉన్నాడు. ఆయన అనుగ్రహం, ఆయన దివ్యసాన్నిధ్యంతో సమానం. దీనినే జ్ఞాన ప్రాప్తి అంటారు. నీవు సూర్య కాంతిలో ఉన్నా, సూర్యుణి/న్ని  తెలుసుకోగోరితే నీకళ్ళను సూర్యుని దిశగా మరలించి చూడాలి. అలాగే దైవానుగ్రహం ఇప్పటికిప్పుడు ఉన్నప్పటికీ, స్వప్రయత్నం ద్వారానే తెలుసుకోవాలి. అలాగే, ఒక అజ్ఞానికి నిత్యం స్వయంప్రకాశమానమై ఉన్న ఆత్మ తెలియకుంటే ఆ దోషం ఆత్మదా లేక ఆ అజ్ఞానిదా . అంటే సూర్యుణ్ణి గుడ్లగూబ చూడజాలకుంటే అది సూర్యుడి తప్పా లేక ఆ పక్షియొక్క దృష్టి లోపమా?
పరమేశ్వరుడు శాశ్వత అనుగ్రహమే. కనుక అనుగ్రహాన్ని ప్రసాదిoచటమనే ప్రత్యేక క్రియ ఉండదు. అది సర్వే సర్వత్రా వ్యాపించి ఉంది. ఈశ్వరానుగ్రహం కావాలనుకునే నీ కోరిక సైతం, నీలో ఇప్పటికే పనిచేస్తున్న ఈశ్వరానుగ్రహం వలన కలిగినదే.
విధాత జీవుల ప్రారబ్ధకర్మను, అంటే జన్మంతరాలలో అవశేషించి యుండి, ఈ జీవితకాలంలో అనుభవిoచ వలసియున్న కర్మను అనుసరించి వారి విధిని నిర్ధారిస్తాడు. నీవు ఎంత ప్రయత్నించినా , విధి నిర్ణయానుసారం మాత్రమే జరుగుతుంది. శరీరం చేయవలసిన కార్యకలాపాలన్నీ ఈ లోకంలోకి వచ్చేటప్పుడే నిర్ణయించబడి ఉన్నాయి. వాటిని ఆమోదించటం, తిరస్కరించటం, నీ అధీనంలో లేవు. నీకు ఉన్న స్వేచ్ఛ అంతా మనస్సును అంతర్ముఖంగా చేసుకునే స్థితిలో ఉండటమే. నీవెంత తప్పించుకోవాలన్నా జరుగనున్నది జరిగే తీరుతుంది.
సృష్టికర్త ఒకరు. జీవులంతా సృష్టింపబడిన వారే. ఈ సృష్టించబడిన వారికే స్వేచ్ఛ ఉంటే, సృష్టికర్త సర్వశ క్తిమంతుడు, సర్వజ్ఞుడు కాలేడు.  అంటే ఏమి జరుగబోతున్నదో ఆయనకు తెలియదు. జరుగవలసినవన్నీ ఎవరికి వారు వారి ఇష్టానుసారం మార్చుకోవచ్చు. అoటే తన అదుపులో ఏదీ లేదన్నమాట.

అలాగాక, ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడూ అయితే జరగబోయేదంతా తనకు ముందుగానే తెలుస్తుంది. అంతా తన అదుపులోనే ఉంటుంది. అంటే మనకు నిర్ణయాలు చేసే శక్తి ఉండదు. విధిని జయించాలంటే ఆత్మను గుర్తించాలి. లేదా శరణాగతి పొందాలి. నిజమైన శరణాగతి భగవంతుని ప్రేమకోసం, ప్రేమించటమే గాని వేరే ఎందుకూ కాదు. మోక్షం కూడా అంతే. 

నిత్యసత్యం - 05


ఆత్మ విచారానికి మార్గాలు రెండు.
1.     నేను ఎవరు – సాధన
2.     శరణాగతి
1.     నేను ఎవడను :
సప్తధాతువులచే ఏర్పడిన ఈ స్థూలదేహము గాని
పంచ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములు గాని
ప్రాణాది వాయు సంచకములు గాని, మనస్సుగాని
ఇవేవీ నేను కాదు. ఇవన్నీ జడములే.
అంటే మనము వేటిని  చూసి ‘నేను’ అని భ్రమ పడుతున్నామో అవి నేను కాదు. మరి ‘నేను ఎవడను?’.  
ఇవన్నియు కాని, ఏకసద్రూపమైన జ్ఞానము, చైతన్యమూ అయినది, ప్రత్యేకమైనది అయిన, ‘ఆత్మ’ యే నేను.
దీని రూపమేదియని తెలిసికొనినపుడు , తానే  గొప్పదియు, జ్ఞానమే స్వరూపము కలదియు, తుది లేనిదియు, ఆది కానరానిదియు , అఖండపరిపూర్ణంబైన సుఖస్వరూపమని తెలియును.
‘అనంతాద్యఖండచిత్ సుఖంబే తాను’.  ఆత్మైక్యానుభూతి వలననే ఆత్మనిష్ఠ కలుగుచున్నది. అట్టి తన్మయనిష్ఠలో , తాను రెండుగా భాసిoచుట ఎట్లు సాధ్యం? నిష్టానుభూతిలో జీవేశ్వర భేదము పూర్తిగా పోవును. జీవేశ్వరులిద్దరును  సత్స్వరూపులై ఉండుటచే ఏకవస్తువై ఉన్నారు.
ఎక్కడైతే ‘నేను’ అను జీవ అహంభావం నశిస్తుందో , అక్కడ అఖండ పరిపూర్ణంబగు పరమాత్మ స్వయముగా‘నేను-నేను’ అంటూ వెలుగుతూ ఉంటుంది. అంటే ‘ఆహమిదం – ఆహమిదం’ అను చిన్న జీవభావము పోయి , ‘అహం-అహం’ అను, అఖండ – ఆత్మభావము ప్రకాశిస్తుంది .మనస్సు అనే వస్తువు ప్రత్యేకంగా లేదు. అది ఆత్మ నుంచి వచ్చిన ఒక ‘కాంతి’. అది ఆత్మ స్వరూపము నందున్న ఒక అతిశయ శక్తి. ఈ మనస్సునుoడియే అన్ని తలంపులు  వస్తున్నాయి. కనుక తలంపులే మనస్సు యొక్క స్వభావము. వీటిని త్రోసివేసినపుడు ‘ఆత్మ’ స్వరూపం దర్శ  నమిస్తుంది.

మనస్సు లెక్కలేనన్ని తలంపులతో విరియుటచే ఒక్కొక్క తలంపు అతి బలహీనంగా ఉంటుంది. ఈ తలంపులను పూర్తిగా కొనసాగించక, ఒక్కొక్క తలంపు కల్గిన వెంటనే ‘ఈ తలంపు ఎవరికి కల్గినది’ అని ప్రశ్నిoచుకో. ‘నాకు’ అన్న జవాబు వస్తుంది. అప్పుడు ‘నేను ఎవడను’ అని ప్రశ్నిoచుకుంటూ , ఒక్కొక్క తలంపుని నాశనం చేస్తూ పోయిన యెడల, అంతర్ముఖుడవై ఆత్మ లోనికి ప్రవేశిస్తున్నావని కనుగొంటావు. అంటే తలంపులు తొలగి, మనస్సు తాను పుట్టిన చోటికి మరలి వస్తుంది. ఈ అభ్యాసము చేయగా చేయగా, మనస్సునకు తన జన్మస్థానమందు నిలిచి యుండు శక్తి అధికమవుతూ వస్తుంది. అప్పుడు ఇతర తలంపులను అడ్డగించ ప్రయత్నమక్కర్లేదు. అవి వాటంతటవే అంతర్ధానమమవుతాయి.
కూర వండేటప్పుడు మూత పెట్టాలి. అప్పుడే ఆవిరి అణుగుతుంది. కూర పక్వమై రుచిని పడి, తినడానికి యోగ్యమవుతుంది. అలాగే మన మనస్సుకి మూత వేస్తే వృత్తులు అణుగుతాయి. మనిషి జ్ఞానియై, ఈశ్వరుడితో లయిoచటానికి సిద్ధమవుతాడు.  
స్వయంకృషి వలననే అంతరాత్మను చేరగలము. ఒక్కసారి చేరిన పిదప నీవేది చేసినను, ఆత్మ చేతనే. నీకందులో నిమిత్తము లేదు. ఆత్మాన్వేషణ తగినంత అభివృద్ధి చెంది పరిపక్వ దశకు చేరినపుడు, ఆ ఆత్మయే నీకు చేయూతనిచ్చి  లోనికి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ‘నిన్ను నీవు తెలుసుకోవలెనను బుద్ది’ కలగటమే, ఈశ్వర అనుగ్రహమునకు గుర్తు. నీలో ప్రకాశించుచున్న అంతరాత్మ, నిన్ను లోపలికి రమ్మని పిలుస్తున్నది. కేవలం నీవు వెలుపలి నుండి లోపలికి పోవుటకు ప్రయత్నించవలెను. అట్టి ఆత్మను కనుగొనిన యెడల, ఈ ప్రపంచమునకు అంతయూ ఆత్మయై వెలుగు ఏకైక వస్తువును కనుగొనిన వాడవవుతావు.
ఆత్మ అనగా అహంభావము, జీవుడు, దేహము కాదు.

పరమాత్మ అనగా అశాశ్వత మగు జీవునకంటే పరమైన పరాపర వస్తు తత్వము.

నిత్యసత్యం - 06

1.       శరణాగతి : శరణాగతి అంటే తనకు తాను, తన సర్వస్వం ఆ కరుణామయుడికి అర్పించడం. ఇక అతనికి మిగిలింది ఏమిటి? ఏమీ లేదు. తనూ లేడు, తనవీలేవు .పుట్టి గిట్టే శరీరం భగవంతుడి పరమైంది. ఇక దాని గురించి ఆలోచించవలసిన పనిలేదు. చావుపుట్టుకలు భయభ్రాంతులను కలుగజేయలేవు. భయానికి కారణం శరీరం. అది తనది కాదు. ఇక దేనికి భయపడాలి?. ఆ విధంగా ఆత్మ తెలియబడి ప్రశాంతత చేకూరుతుంది. ఇప్పుడది అనుభవ పూర్వకమైంది. సుఖదుఃఖాల నుండి విముక్తి కలిగించేది. శరణాగతి అంటేనే ప్రశాంతత. ఇదే ఆ సంబంధం.
నీవాయనకు శరణాగతుడవై ఉంటూ, ఆయన కన్పించినా, కన్పించకపోయినా, ఆయన అభీష్టాన్ని స్వీకరించు.నీ ఇష్ట ప్రకారం ఆయన చేయాలనుకోవటము శరణాగతి కాదు. ఆయనపై ఆధిపత్యమే అవుతుంది. ఏది ఉత్తమమో ఆయనకే తెలుసు. ఎప్పుడు ఏ రీతిగా జరిపించవలెనో ఆయనకు తెలుసు. అన్నీ పూర్తిగా ఆయనకు వదిలిపెట్టు. బరువు బాధ్యతలు ఆయనవే. నీవు తాపత్రయపడవలసింది ఏమీలేదు. నీ తాపత్రయాలన్నీ ఆయనవే. అదే శరణాగతి. అదే భక్తి.
అంతా నేను చేస్తున్నాను అనుకోవటమే పొరపాటు. చేయించేది అంతా ఈశ్వరుడే. అది గ్రహిస్తే బాధల నుండి విముక్తుడవవుతావు. అందరూ భగవంతునిచే సృష్టించబడినవారే. ఆయనచే కాపాడబడుతున్నవారే. నీకు కావలసినది ఆయనకు తెలుసు. చెప్పుకోవలసిన పని  లేదు. ఆయనే చూసుకుంటాడు.
‘చేసేది ఎవరు’ అని ప్రశ్నించుకో. నీవెవరో గుర్తుంచుకో. అపుడు కర్మ నిన్ను బంధించదు. దానంతటదే జరిగిపోతుంది. విధి నిర్ణయానుసారం నీవు చేయవలసినది తప్పనిసరిగా చేయవలసియే యుంటుంది. తప్పించుకోలేవు. ఆత్మానుభవం మనస్సు పరిపక్వతకు సంబంధించిన విషయం.
నీ మటుకు నీవు, ఆకారం ఉన్నదని భావిస్తుంటే, జగత్తూ, భగవంతుడూ కూడా ఆకారం ఉన్నట్లే అనిపిస్తుంది. అంటే భగవంతుని ఆకారం కూడా నీ మనస్సు చేతనే నిర్ణయించబడుతుంది(నీకు కావలసిన రూపంలో).  ఉన్నాడో లేడో  అనే భగవంతుని గూర్చి బెంగ ఎందుకు? నీవున్నావని నీకు తెలుసుకదా. కనుక నీపైనే నీ దృష్టి కేంద్రీకరించి, ఆత్మను తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. ఆత్మ జ్ఞానం కలిగితే అన్నీ అవే అవగతమవుతాయి.
ముఖం ఎట్లా ఉన్నదో తెలుసుకోవటానికి అద్దంలో చూసుకుంటాము. అద్దంలో కనబడేది ప్రతిబింబమే కాని సొంత ముఖం కాదు కదా. అది కూడా అద్దము యొక్క నిబంధనలకు లోబడి అంటే ఎడమ కుడి గాను, కుడి ఎడమ గాను. అట్లానే నీ ఇంద్రియాలకూ మనస్సుకూ తెలిసేది ఏదీ వాస్తవం కాదు. ఎంత గొప్ప దృశ్యాలు కనబడినా, అదేదో నీ ఆత్మ దర్శనం అనుకున్నా లేక నాకే కదా గొప్ప అనుభవం వచ్చిందనుకున్నా అంతటితో నీ అభివృద్ధి  ఆఖరు. ఎవరికి  కనిపిస్తుందో ఇదంతా అని తర్కిoచుకుని , వీటినన్నింటిని తెలుసుకునేది ఏదో, ఆ తెలివిని పట్టుకోవటానికి చూడు. నీ మనస్సు పనిచెయ్యకుండా , ఏ ఆలోచనా లేకుండా, ఏది ఉందో,  అదే నువ్వు . దానినుంచి కదలకు .
ఈ ‘నేను’ అనునది లేని నిద్రయందు కూడా పరిపూర్ణ ఆత్మ ఉంటుంది. మానవుడు తన అహాన్ని నిర్మూలిo చు కోగలిగితే గాని జ్ఞానోదయం కాదు. నేను ఈ పని చేస్తున్నాను అనే భావాన్ని పోగొట్టుకోవాలి.
కొండపైకి ఎక్కి చూస్తే, అన్ని వస్తువులు ఒకటిగానే కన్పిస్తాయి. అలాగే, పైకి వెళ్ళిన కొద్దీ అన్నిటిని ఒకటిగానే చూడటం జరుగుతుంది.
జ్ఞాన మార్గమున ఆలోచించిన పరిశుద్ధమగు ‘అంతరాత్మయే’ సద్గురువు. జ్ఞాన మనగా తనను తాను తెలిసికొని తాదాత్మ్యము చెందటం.
నీవేమి చేసిననూ, చేసితివని అనుకొనిననూ, అదంతా నిజముగా ఈశ్వరుని కార్యమే. అనగా ఆయన చేసినదే. ‘నాది’ అనునది ఏదియు నిజముగా లేదు. సేవ యొక్క ఉద్దేశసారము పరమ భక్తియే. నిజమైన భక్తుడు ప్రతి వస్తువు నందును ఈశ్వర స్వరూపమునే చూస్తాడు. ఈశ్వరునే నామ రూపములతో ధ్యానించటం మొదలుపెట్టినా చివరకు నామరూపాతీత స్థితికి, ఆ ధ్యానమే వానిని తీసుకొని వెళ్తుంది. భక్తి పూర్ణమైనప్పుడు అదే జ్ఞానమని తెలుస్తుంది. ఈ భక్తి కామ్యార్ధమై ప్రారంభించిననూ , ఆ కోర్కెలు సిద్ధిoచగానే భక్తి అంతరించదు. అది మరింత దృఢమై, సంపూర్ణ విశ్వాస మేర్పడి, అభివృద్దియై, పరమోత్తమమగు జ్ఞానమై, తన్మయత్వమును  సిద్దిoపజేయును. జ్ఞానమార్గమున అహంకారము నశించి, సహజ సిద్ద మగు పరమాత్మ అనుభవ సిద్ధి కలుగుతుంది. భక్తి, జ్ఞానం ఈ రెండూ అవాజ్ఞ్మానస గోచరమైన పరమశాంతిని చేకూరుస్తాయి.
హృదయము నుండి మనస్సును బయటకు పోనీయకుండా నిలుపుకొనుటయే ‘అంతర్ముఖము’. ఇట్లు మనస్సు హృదయమున నిలిచినట్లయిన, తలoపులన్నింటికి మూలమైన ‘నేను’ అను అహంభావం పోయి, ఎల్లప్పుడూ ఉండు ‘ఆత్మ’ తానై ప్రకాశిస్తుంది.   ఏది చేసిననూ నేను అను అహంకారము లేక చేయవలెను . అప్పుడు సర్వము శివ స్వరూపముగా తోచును.
జగత్తు అనునది తలంపుల కన్నా వేరుగా లేదు. నిద్రలో తలంపులు లేవు, జగత్తును లేదు. స్వప్నావస్థలోను, జాగ్రదావస్థ లోను, తలంపులు కలవు, జగత్తు కలదు.

ఆత్మ స్వరూపము నుండి మనస్సు వెలువడుట  వలన జగత్తు కనిపిస్తుంది. సర్వవిషయములకు, సర్వ వ్యాపక, వ్యాపారములకు కారణమగుచున్న మనస్సు అణగినప్పుడు దృశ్యముగానున్న జగత్తు అంతర్దానమవుతుంది. అప్పుడు స్వరూప ద/ ర్సన ప్రాప్తి కలుగుతుంది. స్వరూపము కానవచ్చినపుడు జగత్తు కానరాదు. జగత్తుకాన వచ్చినపుడు స్వరూపము కానరాదు .

నిత్యసత్యం - 07

సాలీడు తననుండి నూలు వెలికితీసి, మరల దానిని తనలోకే తీసుకోనును. అట్లే మనస్సు కూడా తననుండే జగత్తును కల్పించి, తనయందే లయము చేసుకుంటుంది.
మనిషి కలగంటాడు. ‘తనని చితకతన్నారని తాను బాధలలో  ఉన్నానని’.   నిద్రలో అదంతా నిజంగానే ఉంటుంది. మేలుకొని అదంతా కల అని నవ్వుకుంటాడు. అలాగే జ్ఞానము ఉదయించినపుడు ఇదంతా ఒక కల అని తెలుసుకుంటావు. స్వప్నావస్థ నుండి జాగ్రదావస్థకు వస్తే గాని అది కల  అని నిజము కాదని తెలుసుకోలేవు. అలాగే జాగ్రదావస్థ ఉన్నంత వరకు ఈ జగత్తు, జీవం, ఈశ్వరం అన్నీ నిజమనుకుo టా వు. ఈ అవస్థలు దాటి, తురియావస్థ కు వస్తే గాని ఇవన్నీ నిజము కావని ఒక ఆత్మ మాత్రమే సత్యమని తెలుసుకోలేవు.
మనుషులు ‘నేను – నేను’ అని చెప్పునట్టిది జనన మరణ ములున్న దేహము గురించియేగాని, అవిలేని ఆత్మ గురించి కాదు.
మనస్సునకు, ప్రాణమునకు పుట్టుచోటు ఒక్కటే. మనస్సు యొక్క తొలి  తలంపు ‘నేను’ అను అహంభావం. ఈ అహంభావం నుండే శ్వాస బయలు దేరుతున్నది. కనుక మనస్సణగినప్పుడు ప్రాణము, ప్రాణము అణగినప్పుడు మనస్సు అణుగును. కాని సుషుప్తి యందు, మనస్సు అణగినను ప్రాణము అణుగుట లేదు. దేహరక్షణ నిమిత్తం, అంటే దేహం మరణిoచిoదేమో అని ఇతరులు భావిoచకుండా  ఉండుటకు ఈ విధముగా ఈశ్వర నియతిచే ఏర్పడి యున్నది.
జాగృతి యందు, సమాధి యందు, మనస్సణగినపుడు ప్రాణము అణుగుచున్నది.అంటే ప్రాణము యొక్క స్థూల రూపము అనవచ్చును.  మరణకాలము వరకు, శరీరమున ప్రాణమును ఉంచి, మరణ సమయమున, మనస్సు ప్రాణమును ఆక్రమించుకుని తీసుకొని పోవుచున్నది.
ఈశ్వరుని ఆజ్ఞానుసారము, కర్మ ఫలము లభించును. కర్మము జడము కనుక శుభ అశుభ  ఫలప్రదములతో దానికి స్వతంత్రశక్తి అసంభవమని, అది జడముగా నుండుట వలననే ఎన్నటికి పరము కాజాలదని, ఈశ్వరుడే కర్మల యొక్క శుభాశుభఫలముల నిచ్చుచూ, జగత్ నియామకుడై ఉన్నాడని, అతడే పరుడని గ్రహింపవలెను.
కర్మ ఫలము అశాస్వతమగుట వలన, తిరిగి కర్మసముద్రమున పడుతూ, మోక్షమును నిరోధించుచున్నది. సుకర్మ ఫలముల వల్ల స్వర్గాది భోగరూపమున, దుష్కర్మ ఫలముల వల్ల నరకవాస కష్టాలను అనుభవరూపమున పొందుతారు. ఈ ఫలానుభవ అనంతరం ఆ అనుభవ వాసన రాబోవు జన్మమునకు కారణముగా ఏర్పడి, జనన మరణములను అలలుగా కర్మ సముద్రమున బడుచున్నది.
అంతా పరమాత్మ స్వరూపమే అంటూ చేసే జగత్తు యొక్క సేవయే ‘పంచ భూతములు, సూర్యచంద్రులు, జీవుడు’ అను అష్ట మూర్తులు గల పరమశివుని పూజ అవుతుంది. విగ్రహారాధనము ఈశ్వరుని అష్టమూర్తులలో నొకటియగు పార్థివమూర్తి యొక్క ఏక దేశారాధనమే గాని, పూర్ణ పూజ కానేరాదనియు, సర్వ జగత్తును ఈశ్వర స్వరూపముగా గ్రహించి చేయు సేవయే ఉత్తమోత్తమమగు పూర్ణ పూజ అనియూ గ్రహించవలెను.
ఈశ్వరుడు వేరు, నేను వేరు అను భావముతో కూడిన ఈశ్వర భావన కంటే, అతడే నేననెడు  అభిన్న భావన పావనమైనది. హృదయ స్థలమునందు  మనస్సు స్వస్థమై యుండుటయే కర్మము. అదియే భక్తి, అదియే యోగము.  అదియే జ్ఞానము. ఇది నిశ్చయము. అనగా మనస్సు వి / జ్రుం భించుచోటు శిరస్సే అయిననూ, అది పుట్టుచోటు హృదయమే అగును.

అనగా, ఆత్మ తేజము నుండి ఒక రశ్మి బయలు వెడలి శీర్ష స్థానమును చేరి మనస్సు అగుచున్నది. అది స్వస్థత చెందుట అనగా తన ఉత్పతి స్థానమును తిరిగి చేరుటయే. ఆ స్థానమే ఆత్మ. అదియే హృదయము. మనస్సు యొక్క స్వరూపమును వెదకిన యెడల మనస్సు అన్నదియే లేదని తెలియును. అది ఆత్మ నుండి వచ్చిన ఒక రశ్మి. 

నిత్యసత్యం - 08


హృదయం
చైతన్యం యొక్క స్థానం హృదయమే కాని శిరస్సు కాదు, హృదయం వక్షస్థలానికి ఎడమవైపున ఉన్నట్టి భౌతిక అవయవం కాదు. అది కుడివైపున ఉన్న చైతన్యం. ఈ హృదయాన్నే ఆత్మగా భావించమని, అది శరీరంలోను, దేహాతీతమని తెలుసుకోవాలి. అసలైన చైతన్యాన్ని నీవు అన్వేషిస్తున్నావు. అది నీకు ఎక్కడ లభిస్తుంది. దాన్ని నీ వెలుపల పొందగలవా. దాన్ని నీలోనే చూడాల్సి ఉంది. కాబట్టి లోపలికి చూడమన్నాను. హృదయం చైతన్యానికి ఉనికి పట్టు లేక చైతన్యమే అది.
గది చీకటిగా ఉన్నప్పుడు, వెలుతురు కావలసి వస్తే, దీపం కావాలి. కాని సూర్యుడు ఉదయిస్తే ఇక దీపంతో అవసరం లేదు. ఎందుకు? సూర్యుడు స్వయం ప్రకాశం కల్గినది కనుక. అది వస్తువులను చూచేందుకు ఆవసరమే.  కాని హృదయాన్ని చూచేందుకు మనస్సును దానివైపుకు తిప్పితే చాలు. అప్పుడు మనస్సు తానై నశించి, హృదయం అనే ఆత్మ ప్రకాశి స్తు o ది.
‘నేను ఎవరు’ అను విచారణ మాత్రమే ఆవశ్యకం. సుషుప్తి సమయంలోను, మెలకువ సమయంలోను, కొనసాగుతున్న అస్తిత్వం ఒక్కటే . ‘నిద్ర లేచింది ఎవరు’ అని అడిగితే ‘నేను’ అంటావు . ఈ ‘నేను’ నే గట్టిగా పట్టుకో.   నిత్యసత్తా తానై ద/ర్సనమిస్తుంది . ముఖ్యాతిముఖ్య విషయం ‘నేను’ ను వెతకటమే గాని హృదయ కేంద్రం పై ఏకాగ్రం చేయటం కాదు. 
ఆత్మ
ఆత్మ అంటే అసలైన నేను, వ్యక్తిగతం కాదు. అది సర్వసమృద్ధమైన ఎరుక. అది పైకి గోచరించే వ్యక్తిగత అనుభవం కాదు. దానికీ, వ్యక్తిగత ఆహానికీ తేడా ఉంది. నిజానికి ఈ అహానికి ఉనికి లేనే లేదు. దీనిని  మనస్సు కల్పిస్తుంది.    ఆత్మను అనుభవసిద్దo చేసుకోనీయదు. ఆత్మ ఎప్పుడూ సంస్థితమే. ఎప్పుడూ అనుభవసిద్ధమే. కాని, ఎన్నో అవరోధాలను కల్పించే మానసిక వాసనలు అనగినప్పుడే, ఆ అనుభవం ప్రత్యక్షంగా తెలియవస్తుంది. నిత్యమూ, నిరంతరంగా ఆ ఆత్మను ఎరిగి ఉండటమే, ఆత్మ సాక్షాత్కారమంటే.  ఆత్మ అనేది విశుద్ధ స్థితి.  నేనున్నాననే ఎరుక .
ఆత్మ సాక్షాత్కారం పొందటమంటే కొత్తగా దేనినో సృష్టించటం కాదు. చూడటం కాదు. అంతకు పూర్వం లేని దానినేమీ సాధించటం లేదు. ఎల్లవేళలా నీ నిజస్థితిలో సుస్థిత మవటమే. ఆ స్థితి దృశ్యానికీ, ద్రష్టకీ అతీతం. చూచేవాడుగాని, చూడబడేది గాని ఉండవు. ఇపుడు అన్నింటినీ చూస్తున్న ద్రష్ట ఉండడు.
ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. సాక్షాత్కారమంటే కేవలం తానుగా ఉండటమే. దీనిని తెలుసుకోవటం గానీ, ఏదైనా అవటం గానీ కాదు. ఆత్మలో సంస్థితమైనవారు భావాలు లేని సౌందర్యంలో ఉంటారు. వారు భావిoచవలసిoదేమీ లేదు. అంటి పెట్టు కొని ఉండవలసిoదల్లా మౌనానుభవాన్నే (ఆ స్థితిలో తానుగా ఉండటం తప్ప వేరే సాధించవలసిoదేమీ ఉండదు. మౌనమంటే వాక్కుకీ, భావానికీ అతీతమైన స్థితి. అహంకారం ఏ మాత్రం ఉదయించని స్థితి. మౌనానుభూతే, అసలైన, పరిపూర్ణమైన జ్ఞానం, మౌనమైన ఆత్మే భగవంతుడు.ఆత్మే జీవుడు. ఆత్మే విశ్వం. ఆత్మే అసలైన జ్ఞానం.
ఏ భావమూ లేని స్థితే నిజమైన స్థితి. ఆత్మని గ్రహిoపని వారెవరైనా ఉంటారా అసలు. తన ఉనికిని ఎవరైనా కాదంటారా. ఆత్మ సాక్షాత్కారం అనేది ఒక గమ్యమని అనుకుంటే అది శాశ్వతo కానేరదు. ఎందుకంటే, ఈ అహంకారం కంటే ముందే  గమ్య ముంది. గమ్యంలో ఉన్నదేదో అది మన పుట్టుట కo టే ముందే ఉంది. 
మనస్సు తనని తాను నాశనం చేసుకోలేదు. అందువల్ల దాని యొక్క నిజస్వరూపం తెలుసుకో. ఆత్మని అన్వేషిస్తే మనస్సు మాయమవుతుంది. ఆత్మలో సంస్థితమైనప్పుడు, మనస్సు గురించి పట్టించుకోనక్కరలేదు.

అహంకారం ఉదయించిన తర్వాత, కాలమనే భావం వస్తుంది. కాని కాలానికి, దేహానికి అతీతమైన ఆత్మవు నీవు. ఈ రెండు లేకపోయినా నువ్వున్నావు. స్వభావాలు విస్తీర్ణమై , మనస్సు నిర్మలమై, ప్రతి వారిలో ప్రతి పనిలో ఈశ్వరుణ్ణి చూడగలిగే శిక్షణ  పొందాలి.

నిత్యసత్యం - 09


భగవంతుడు.
ఈ విశ్వమంతా ఆత్మ యొక్క శక్తి వల్లనే నిలబడుతోంది. (దీనినే ఆస్తికులు ‘భగవంతుడు’అంటారు )
భగవంతుడనేది ఆత్మకు పర్యాయపదం. భగవంతుడు సాకారుడు కాదు. విశ్వంభరుడైన నిరాకారుడు. ఆయనకు గల శక్తికి, విశ్వం ఒక బాహ్య రూపం మాత్రమే. ఆయనని విశ్వం నుండి విడదీయలేము. కాని విశ్వం యొక్క ఉనికి గాని, లేమి గాని ఆయనని ప్రభావితం చేయదు. ఆత్మ అనేది విశుద్ధ స్థితి. నేనున్నాననే ఎరుక.
అయితే, ఆ ఎరుకలో ‘నేనిది’ ‘నేనది’ అన్నభావముండదు . ఆత్మలో కర్తగాని, కర్మగాని, ఉండవు. అది కేవలం ఎరుకే. ఈ ఎరుక చైతన్యమవటం వల్ల ,దీనిని ప్రత్యక్షంగా అనుభవించటమే, నిరవధిక సంతోషం మరియు ఆనందం. ఉనికి , చైతన్యం, ఆనందం, వేరువేరుగా కాక, అవిభాజ్యంగా, ఏకలక్షణంగా ఆత్మకి అనుభవ సిద్ధమౌతాయి.
ఆత్మ జ్ఞానంలో ఏ మాత్రమూ అవిద్య లేదు. స్వచ్చంగా ప్రకాశిస్తూ  దుఃఖంగాని, దేహంగాని లేకుండా, ప్రపంచపు లేమి, ఉనికి ఎరిగినప్పుడు కూడా ఉండే సత్యమే నీ నిజ స్వరూపం. చిదానందాన్ని విరజిమ్ముతూ, లోపలా బయటా సమానంగా ప్రకాశించే ఎరుకే, ఆనందమయమైన మౌలిక సత్యం. మౌనం దాని స్వరూపం . అసలైన , అవరోధం లేని జ్ఞానమదే. జ్ఞానమే వైరాగ్యం, జ్ఞానమే స్వచ్చత, జ్ఞానమే భగవంతుని పొందు. ఆత్మని విస్మరింపని జ్ఞానమే అమరత్వం.
ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంది. ప్రతి వారికీ ఆత్మని తెలుసుకోవాలనీ ఉంటుంది. తన గురించి తాను తెలుసుకోవటానికి ఎవరి సహాయం కావాలి. అంతర్ముఖమైన మనస్సు ఆత్మ. అదే బహిర్గతమైతే అహం, ప్రపంచం అవుతుంది . మనస్సు లేకుండా ఆత్మ ఉంటుంది. కాని ఆత్మ లేకుండా మనస్సు ఉండదు. అంటే మనస్సుకు స్వయం ప్రతిపత్తి లేదు.
తాను ఒక వ్యక్తిననీ , ఒక దేహాన్ని ఆక్రమిoచుకున్నానని, ఊహించటం మానివేస్తే అన్ని తప్పు అభిప్రాయాలు పోయి, ఆత్మజ్ఞానం శాశ్వతంగా కలుగుతుంది. నువ్వే ఆత్మవి. నువ్వు ఎప్పుడూ అదే. అసలు సంగతేమిటంటే నీ ఆనందమయస్థితి గురించి నీకు తెలియదు. ఈ ఆనందనిలయమైన ఆత్మను నీ నుంచి అజ్ఞానం ఒక తెరవలే కప్పివేస్తుంది. నీవు చేయవలసిన కృషి అంతా ఆ తెరను తొలగించటానికే. ఎప్పుడూ ఉండేది చైతన్యం. నిద్రలో శరీరమున్నట్లే, తెలియదు. మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే శరీర స్పృహ వస్తుంది. దాని వెనుక దాని వాసనలూనూ. ఈ శరీరమే నేను అనుభావం పోవాలి. అదే సాక్షాత్కారం.
అంతటా వ్యాపించియున్న ఆత్మని తెలుసుకోలేమంటే ఎలా. ఆత్మస్వరూపం తెలియదనటం ‘నేనెవరో నాకు తెలియదు’ అనటం వంటిది. ఆత్మ స్వరూపమే నీవు. నీవే ఆత్మ. భాగవత్సాక్షాత్కారమన్నా , ఆత్మసాక్షాత్కారమన్నా ఒక్కటే. ఈ ఆత్మని ఎలా తెలుసుకోవాలి అని అడగటo ఎలా ఉందంటే “రామణాశ్రమంలో ఉంటూ, రమణాశ్రమం చేరుకోవటానికి మార్గాలేమిటి? వాటిలో అన్నిటి కన్నా మంచిదేమిటి? “ అన్నట్లుంది. నీవు చేయవలసిందల్లా, ఈ శరీరమే నేను అనే భావాన్ని, ఇతర బాహ్యవిషయాలను, ఆలోచనలను విడనాడటమే . ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూలకారణం అహంకారం . దాని మూలం కనుక్కొంటే అదిలేదని  నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది.   
స్వప్న, సుషుప్తి, జాగ్రదావస్థలలో నువ్వు ఆత్మగా వున్నావనేది స్పష్టం.
ఈ మూడు అవస్థలూ వస్తుంటాయి, పోతుంటాయి. కాని నువ్వు మాత్రం ఎప్పుడూ ఉంటావు.
ఇదొక సినిమా లాంటిది. తెర ఎప్పుడూ ఉంటుంది. తెరమీద బొమ్మలు, పెద్ద పెద్ద కెరటాలతో మహా సముద్రం, మంటలు, ఇలాంటివన్నీ కనబడతాయి, పోతాయి. కాని తెరని ఏదీ ఏమీ చేయలేదు. అందువల్ల ఏ అవస్థలో ఉన్నా వాటి ప్రభావం నీ మీద ఉండదు. నువ్వు ఆత్మగానే ఉంటావు. దానికి ఒకే ఒక అవస్థ ఉంటుంది. అదే చైతన్యం లేదా ఉనికి.  అదే సత్యం.
                                                           








నిత్యసత్యం - 10

చైతన్యానికి మెలుకువ జోడిస్తే జాగ్రదావస్థ
చైతన్యానికి నిద్ర జోడిస్తే సుషుప్తి
చైతన్యానికి కల జోడిస్తే స్వప్నం
నిజానికి స్వప్నావస్థకీ, జాగ్రదావస్థకీ, తేడా ఏమీ లేదు. స్వప్నావస్థ చిన్నది.జాగ్రదావస్థ పెద్దది. రెండూ మనస్సుకి ఫలితాలే. జాగ్రదావస్థ ఎక్కువ కాలముంటుంది. కాబట్టి అదే నిజస్థితి అని ఊహించుకుంటాం . కాని అసలు నిజస్థితి ఆత్మయొక్క సహజ స్థితి. ఈ అవస్థలు వస్తూపోతూ ఉంటాయని ఆత్మ అంటోందా. అవి వస్తూ పోతూ ఉన్నాయనేది ద్రష్టే.  ద్రష్టా, దృశ్యము  కలిస్తే మనస్సవుతుంది.  అసలు మనసంటూ  ఏదైనా ఉన్నదేమో గమనించు. మనస్సు ఆత్మలో లీనమైనపుడు ద్రష్టా లేడు దృశ్యమూ  లేదు. అంటే ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. దీని గురించి ఎంత విడమర్చి చెప్పినా, ఆత్మ సాక్షాత్కారమయ్యే వరకు సత్యం తేట తెల్లం కాదు. అది జరిగిన తర్వాత ఇంతకాలమూ స్పష్టంగా ఎల్లవేళలా ఉండే దానిని ఎట్లా చూడలేకపోయానా అని ఆశ్చర్యం కలుగుతుంది.
“నేను ఈ దేహాన్ని” అని అంగీకరిస్తే, ఆత్మలు అనేకం. ఈ భావం మాయమైపోయే స్థితిలో ఉండేదే ఆత్మ. ఆ స్థితిలో వేరే వస్తుజాలమంటూ ఏమీ లేదు. ఈ కారణం వల్ల ఆత్మ ఒక్కటే అని అంటాం. ఆత్మ యొక్క సహజ స్థితిలో దేహం, మనస్సు, లోకం లేవు.
ఆత్మను తెలుసుకోవలసిందెవరు? జడపదార్ధమైన శరీరం తెలుసుకోగాలదా? నువ్వు శరీరం కాదు కదా. నువ్వు ఆత్మవి. దీనిని గుర్తించక పోవటం వలననే శాస్త్రాలు మాయలు, లీలలు చెప్తున్నాయి.

రకరకాల నగలలో ఉన్న బంగారాన్ని అంచనా వేసే కంసాలి, వాటిలో ఉన్న బంగారాన్ని తప్ప దేనిని పట్టించుకోడు. అలాగే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆత్మను తప్ప దేనినీ చూడడు.

నిత్యసత్యం - 11


జ్ఞాని
“తెరలేకుండా బొమ్మలు లేవని” తెలుసుకుంటే “చూచేవాడు లేకుండా చూడబడేది లేదు” అని తెలుసుకుంటే, ఎవరూ భ్రమచెందరు. జ్ఞానికి బొమ్మలూ, తెరా రెండూ ఆత్మేనని తెలుసు. జ్ఞానికి వచ్చే కలలు, కలలే అని తెలుస్తుంది. మెలకువగా ఉన్నప్పుడు కూడా, అదీ ఒక కలేనని భావించినట్లే, అదీను.  అంటే, జ్ఞాని తురీయావస్థలో, అంటే పరమ సత్యంలో సంస్థితమవుతాడు. అంటే వాస్తవానికి ఉండేది తురీయావస్థ. మిగిలిన మూడూ ఉన్నట్లే అనిపించినా అవి లేవు. ఒక జ్ఞాని కర్మాచరణలో ఉన్నప్పుడు, అతని మనస్సు ఆత్మనిష్ఠలో ఉంటుంది.కనుక అతను చేసే పని అతనిని కలవరపెట్టదు .
జ్ఞానికి  దేహాత్మ బుద్ధీ ఉంటుంది. కాకపోతే, ఇదంతా ఆత్మే, బ్రహ్మమే అనుకుంటాడు. నొప్పి ఉంటే ఉండనీ, అది కూడా ఆత్మలో భాగమే. ఆత్మ పరిపూర్ణం. దేహాత్మ బుద్దిని దాటిన తర్వాత ఎవరై నా జ్ఞాని అవుతారు. ఆ బుద్ధి లేకపోతే క కర్తృత్వమూ లేదు, కర్తా లేడు. అందువల్ల జ్ఞానికి కర్మ లేదు. (అంటే ఏ కార్యమూ చేయడు )
సర్వాన్ని ఆత్మగా గ్రహించటమే వాస్తవికం. ఆత్మదృష్ట  జగత్తులోనూ ఆత్మనే దర్శిస్తాడు. జగత్తు కనిపిస్తున్నదా  లేదా అనేది జ్ఞానిదృష్టిలో ఏ మాత్రం ముఖ్యం కాదు. ఎల్లప్పుడూ అతని ధ్యాస  ఆత్మాభిముఖం గానే ఉంటుంది. అక్షరాలకు  వ్రాయబడే కాగితాలకు ఉన్న సంబంధం లాంటిదే ఇది కూడా. అక్షరాలపై దృష్టి లగ్నం చేసి, దానికి ఆధారమైన కాగితాన్నే నీవు విస్మరిస్తావు. కాని జ్ఞాని అలా గాక అక్షరాలు  ఉన్నప్పుడూ అవి లేనప్పుడూ కూడా , కాగితాన్నే ఆధార వస్తువుగా గ్రహిస్తాడు.
జీవించటానికి పనులు చేయటానికి మనస్సు అవసరముం ది. కాని మనస్సు యొక్క ప్రమేయం లేకుండానే జ్ఞాని ఈ రెండు పనులను చేస్తాడు. కుండ తయారు కాగానే కుమ్మరి చక్రాన్ని తిప్పడం మానుకుంటాడు. కాని చక్రం మాత్రం ఇంకా తిరుగుతుంది. శరీరం జన్మించటానికి కారణమైన ప్రారబ్ద కర్మ , శరీరమేయే పనులు చేయాలో దానితో చేయిస్తుంది. ఈ పనులన్నీ చేస్తున్నా, జ్ఞాని మాత్రం తాను కర్తనని అనుకోడు.
మనుష్యుల యొక్క వైరుధ్యములూ , వైవిధ్యములూ ఉపరితలాన కనబడేవి గానే చూస్తాడు. వాటికి సంస్థితమైన ఒకే ఒక సత్యానికి ఏ భేదమూ లేదని గమనిస్తాడు. అలాగే అతనికి అభిమాన పాత్రమయిన రుచులంటూ ఉండవు. వాటి వ్యత్యాసాలను గమనిస్తాడు కాని అన్నింటిలో ఒకే ఒక సత్యాన్ని చూస్తాడు. అతడు కదిలినా, మాట్లాడినా, ఏదైనా చేసినా కూడా, అతని చేష్టలన్నీ ఒకే ఒక సత్యం లోనివే.
మంచి వారి పట్ల ఆప్యాయత , నిస్సహాయుల పట్ల దయా, మoచి పనులు చేయటంలో ఆనందం, దుష్టుల పట్ల క్షమా, ఇవన్నీ జ్ఞానికి సహజ లక్షణాలు.
జ్ఞాని ఏ అనురక్తి లేకుండా ఏ విధంగా ప్రభావితం కాకుండా ఇతరుల కోసం పనులు చేస్తాడు. ఏడ్చేవా ళ్ళతో ఏడుస్తాడు. నవ్వే వాళ్ళతో నవ్వుతాడు. అడేవాళ్ళా/తో ఆడుతాడు . పాడేవాళ్ళాతో / పాడుతాడు .
అతని ఉనికి నిర్మలమైన ,శుభ్రమైన అద్దం వంటిది. ఒక సంఘటన అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించడు జ్ఞాని. అంటే అతని మనస్సుపై ఏ ముద్రా వేయదు. అంటే దానివల్ల ఏ ప్రభావమూ ఉండదన్న మాట. గురువు/జ్ఞాని చుట్టూ ఉండి వారిని సేవించుకునే భక్తులకు ఎదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుందని అందరూ అనుకుంటారు. అట్లాంటి ప్రత్యేకత ఉంటే అ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు. లోకంలో ఎక్కడ ఎంత దూరాన ఉంటేనేం, ఎవరు గురువుకు తాను సంపూర్ణంగా అర్పించుకుo టాడో , ఎవడు సమస్తమూ గురువేనని , తానేమీ కాదనీ, తన అహంకారాన్ని విసర్జిస్తాడో, అట్లాంటి అతనిని ఉద్ధరించటం గురువు/ఈశ్వరుని విధి. అట్లా అర్పించుకున్నవాడు ఏ ప్రార్ధనా చేయనక్కరలేదు. ఈశ్వరుడే పరుగెత్తుకుని వచ్చి సదా అతని వెంట ఉంటాడు. పద్మం పక్కన కప్పు నివసిస్తూ ఉంటుంది. ఏ దూరన్నుంచో తుమ్మెద వచ్చి మకరందం తాగిపోతుంది.
భగవంతుడు, ఆత్మ, హృదయం, చైతన్య స్థావరం, ఈ పేర్లన్నీ ఒక్కటే. హృదయమే మనిషి అంతరాంతరం. అదే కేంద్రం. అది భౌతికం కాదు.
“హృత్ – అయం” అంటే “ఇది కేంద్రం” అని అర్ధం. ఇక్కడ నుండే అన్ని భావాలు ఉదయించి , దాని మీదే ఆధారపడి , దానిలోనే  లయమైపోతాయి.మనస్సు భావాల సమూహం. భావాలే ప్రపంచానికి రూపాన్నిచ్చాయి . బ్రహ్మం నుండే జీవులన్నీ ఉద్భవిస్తాయని ఉపనిష త్తులు చెప్తాయి. అదే హృదయం. బ్రహ్మమే హృదయం. 

మనకు కావలసిందల్లా , ఆత్మసాక్షాత్కారం కాలేదన్న భావాన్ని తొలగించుకోవటమే.  మనమెప్పుడూ ఆత్మే. ఎటోచ్చీ మనం ఆ విషయాన్ని గ్రహించం . మనస్సణగితే , ప్రపంచమూ అణగిపోతుంది. అంతటికీ మూలకారణం మనస్సే. అది అణగితే సహజస్థితి ప్రకటితమవుతుంది. ఆత్మ ఎప్పుడూ “అహం-అహం” అంటూనే ఉంటుంది. అది స్వయం ప్రకాశం. మనం దానిలోనే ఉన్నాం. అందులోనే ఉంటూ దానికోసం వెతకటం దేనికి? “దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే ప్రపంచమంతా బ్రహ్మం గా గోచరిస్తుందని ‘. మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు.

నిత్యసత్యం - 12

ఆత్మ
ఈశ్వరుని లేక ఆత్మను చేరటానికి తీవ్రంగా యత్నించే మనిషికి ఏ సిద్ధాంతమూ అవసరం లేదు. ప్రతి వ్యక్తీ ఆత్మే. వాస్తవంగా అనంతమే. కాని ప్రతివాడు తన శరీరాన్ని ఆత్మగా భ్రమిస్తాడు. దేన్ని గ్రహించాలన్నా వెలుతురు ఉండాలి. ఇది జ్యోతి (ఆత్మ) యొక్క స్వరూపానికి చెందినదిగానే ఉండగలదు. అది భౌతికమైన వెలుగునూ, భౌతికమైన చీకటిని కూడా ప్రకాశిoపజేసేదై యుండాలి . అంటే మనకు కనిపించే వేలుగుకూ ,చీకటికీ అతీతంగా ఉంటుందన్నమాట. తానై వెలుగూ కాదు. తానై చీకటీ కాదు . కాని అది ప్రకాసాన్నందిస్తున్న కారణంగా “జ్యోతి” అనబడుతుంది. అది అనంతము మరియు చైతన్యము. ప్రతి వారికీ తెలిసియున్న చైతన్యమే ఆత్మ. ఏ ఒక్కరూ ఆత్మకు దూరంగా ఉండలేరు . కాబట్టి వాస్తవంలో ప్రతివాడూ ఆత్మజ్ఞానియే. విచిత్రమేమిటంటే జనానికి ఈ విషయం తెలియనందువల్ల వారు ఆత్మను తెలుసుకోవాలని వాంఛిస్తారు.  
సుఖం
సుఖమనునది ఆత్మ స్వరూపము. ఇవి రెండూ వేరు కావు  .ప్రపంచమునందున్న ఒక్క వస్తువులోను సుఖము లేదు. మనం అవివేకంతో వాటివలన సుఖం కలుగుతుందని తలుస్తాము. మనస్సు ఆత్మ నుండి బయటకు పోవునపుడు దుఃఖం అనుభవిస్తుంది. వాస్తవమున మన కోరికలు తీరినపుడెల్ల మనస్సు యథా స్థానమునకు మరలి ఆత్మ సుఖమునే అనుభావిo చుచున్నది. ఈ విధంగా మనస్సు ఆత్మను వదలి బయటకు లోపలికి చరిస్తూ ఉంటుంది. అంటే నీడలో నుండి ఎండకు, ఎండలోనుండి నీడకు వచ్చుచున్నట్లు. కొంతసేపు అటు, కొంతసేపు ఇటు వచ్చువాడు అవివేకి. వివేకి ఎప్పుడూ నీడను విడిచిపోడు. అంటే జగత్తు ఉన్నప్పుడు దుఃఖం,  అది లేనప్పుడు, మనస్సు, ఆనందాన్ని అనుభవిస్తుంది.
మాయ

భగవంతుని స్వశక్తి వల్లనే సృష్టి జరిగింది. జగత్తు అంతా మాయ అంటాం. అసలు మాయే మాయ కదా. దానిని ఎవరైనా వెలుపలినుండి కదా చూడాలి. అటువంటప్పుడు మాయలోని తారతమ్యాలను ఎలా గుర్తించగలం. జగత్తు ఒక దృగ్విషయం . ఈ దృశ్యమాన జగత్తు ఏ మార్పు చెందనట్టి ఒక ఏకైక సత్య వస్తువు యొక్క సత్తాపై ఆధారపడి ఉన్నది. జగద్వ్యవహారంలో మునిగి ఉన్నావు కాబట్టి ఈ జగత్తు నీకు సత్యంగానే గోచరిస్తుంది. జగత్తుకు అతీతంగా పో. అపుడది మాయమై, సత్యమొక్కటే నిలుస్తుంది. మనస్సు బహిర్ముఖమై ఉన్నప్పుడు జగత్తు యొక్క ఉనికి , బాహ్యమైన వస్తువుగానే గోచరిస్తుంది. అట్టి సమయంలో మనస్సు ఆత్మలో తన అనన్యాత్మకతను పోగొట్టుకుంటుంది.

నిత్యసత్యం - 13

ఆత్మ సాక్షాత్కారము
దీని గురించి మాట్లాడటం భ్రమ. ఎందుకంటే ప్రజలు అనాత్మను ఆత్మగాను, అసత్యాన్ని సత్యం గాను భ్రమిస్తారు. దానిని పోగొట్టుకోవటానికి ఆత్మ సాక్షాత్కారమైoదనుకోవటం ఇంకా భ్రమ. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉండేదే. దానికి సాక్షాత్కారం ఉండదు. ఉండేదంతా ఆత్మ తప్ప వేరేలేనప్పుడు, ఎవరికి సాక్షాత్కారం కలుగుతుంది. ఎలా కలుగుతుంది.
మోక్షం
అందరూ మోక్షం ఎక్కడో ఉందనుకుంటారు. దాన్ని పొందాలి అనుకుంటారు. కాని అది తప్పు. నీలో ఉన్న ఆత్మను తెలుసుకోవటమే మోక్షం. కేంద్రీకరించు .అది నీకు లభిస్తుంది.
మంత్రం
నిశ్చలంగా అoటే ఆలోచనలు లేకుండా ఉండి , ‘నేనే దైవమని’ అనుకో. అదే మంత్రం.
ముక్తి
ముక్తి మన సహజ లక్షణం. మనకి అది మారుపేరు. ముక్తి కావాలని కోరుకోవటం హాస్యాస్పదం. నీడలో ఉన్న మనిషి ఎండలోకి వెళ్లి, మళ్ళీ విశ్వ ప్రయత్నం చేసి నీడలోకి రాగానే, ‘అమ్మయ్య నీడని చేరుకున్నాను’ అన్నట్లే. మనమంతా ఇదే చేస్తున్నాం. సత్యానికి, మనకి భేదముందనీ, ఊహించుకుని, భేదభావం కల్పించుకుంటాం. తర్వాత ఎంతో సాధన చేసి భేదభావాన్ని వదిలించుకొని సత్యంతో ఏకమవుతాం. ఈ భేదభావం కల్పించుకోవటం ఎందుకూ, దానిని నాశనం చేసుకోవటం ఎందుకూ.

ఉత్తమ భక్తుడు
స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను తాను అర్పణము చేసుకుంటాడో అతడే భక్త శ్రేష్ఠుడు. ఆత్మ చింతనము తప్ప, ఇతర ఆలోచనలకు కొంచెమైనను తావీయక, ఆత్మనిష్టాపరుడై ఉండుటయే తనను ఈశ్వరునికి అర్పించుకొనుట .
ఈశ్వరునిపై ఎంత భారం మోపినను దానినంతను అతను వహించు చున్నాడు. సకల కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుoడుట వలన, మనము దానికి లోబడి  ఉండుట శ్రేయస్కరము.

ముక్తి /గురువు
ఈశ్వరుడు గురువు. గురువు ముక్తి చేరు మార్గమును చూపువాడే గాని, తానే జీవుని ముక్తికి చేర్చువాడు కాడు. యదార్ధమున ఈశ్వరుడు, గురువు వేరు కాదు. గురుకటాక్ష దృష్టిని పడినవాడు అతనిచే రక్షింపబడునే గాని
ఎన్నటికీ విడువబడడు .
అయినను, ఒక్కొక్కరును తమ ప్రయత్నము వలననే, గురుడు చూపిన దారి తొలగక అనుసరించి ముక్తిని పొందవాలెను. తననుతానే తన జ్ఞాన చక్షువులతో చూచుకొనవలెనే గాని ఇతరుల ద్వారా కాదు.

వైరాగ్యం
ఉత్పత్తి అయ్యే సమస్త తలంపులను, ఉత్పతి స్థానంలోనే నశింపచేయడాన్ని  వైరాగ్యం అంటారు. ఒక్కొక్కరు వైరాగ్యాన్ని పూని, తనలో లోతుగా మునిగిన ‘ఆత్మ’ అనే ముత్యాన్ని పొందగలరు.




సహజ సమాధి

ఇది ప్రత్యేకమైనది. జ్ఞానరీత్యా ఈ సహజ సిద్ధియే నిర్వికల్ప స్థితి. ఇందులో నీకు సమాధానము కలదు. నీవు దినచర్య చేయుచుoడినను, శాంతియు నిలకడయు, యుండును. నీవు కేవలము అంతరాత్మ ప్రేరితుడివై చరిoచు చున్నావని గుర్తింతువు . అందువలననే, నీవేది చేయుచున్నను, తలచుచున్నను, ఆ చేతలు, తలంపులు నీకు చెందవు. నీకు చింతలుండవు, ఆతురత ఉండదు. బాధ్యత ఉండదు. ఇచ్చట సంభావాసంభావములు, సాధ్యాసాధ్యములు మొదలగు ద్వందముల మధ్య ఊగిసలాట ఉండదు. ఏ విధమైన వికల్పమును లేదు. దానికి సత్య వస్తువును గురించి సంశయమే లేదు. నిశ్చయమే. సత్య వస్తువు ప్రత్యక్షముగా ఉండును. ఎందువలననగా, ఆహoకారాన్విత జీవునికి చెoదిన దేదియు లేదు. ప్రతి పని కూడా వేరై యున్న ఒక వస్తువు చేత జరుపబడుచుండును. అట్టి గొప్ప వస్తువుతో నీవేకమై యుందువు.

Monday, 8 August 2016

నిత్యసత్యం - 14


సాధన – సిద్ది
ఎదో ఒక స్థితిలో మనస్సు చలించకుండా ఉండటం సాధన. అపుడు నీవు జాగరూకతతో ఉంటావు. ఈ స్థితి ముదిరి, గాఢమై, నీలో పాతుకున్న మీదట నీ ప్రయత్నం ఉండదు. నీకు బాధ్యత లేదు. అపుడు ఆ స్థితిని ‘సిద్ది ‘ అంటారు. సిద్ధులు  స్థబ్డులై ఉండనక్కరలేదు. ప్రపంచ వ్యవహారమును నిరంతరము జరుపుచుండు ఈశ్వరుడే అట్టి అచేతన స్థితిలో స్థబ్దుడై లేడు.
నిద్రపోతున్నపుడు వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు గాని అంతర్గతంగా ఉండే తమ పూర్వ వాసనల వల్ల , వాళ్ళు అదే వ్యక్తిత్వాన్ని పొందుతారు. ఆ విధంగానే, అంతరవాసనలనే జీవమూలనాశనం చేయకుంటే, మరణ సమయంలో అవి హృదయంలోకి చేరుకుoటాయే  గాని నశిo చ వు. జీవులిట్లా పునర్జన్మ పొందుతారు.  
మనిషి పాప పుణ్య కర్మల వల్ల భూమిపై జన్మ ఎత్తవలసియే ఉన్నది. భగవంతుడు తన కృప వల్ల, పునర్జన్మ కు సంబంధించిన ఈ జ్ఞానాన్ని, మనుషులకు అందనీయడు. పునర్జన్మలో గుణవంతులై ఉంటే గర్వం, అలా కాకుంటే దిగులు చెందుతారు. రెండూ చెడే . ఆత్మను తెలుసుకొని, ఆత్మ జ్ఞానాన్ని పొందితే చాలు.
ఆకలితో బాధపడే వాణ్ని అది స్వప్నం అని చెప్పటం ఎంత వరకు సమంజసం.
జ్ఞాన దృష్టి తొ చూస్తే ఎందులో ఆ బాధ చిన్న భాగంగా ఉంటుందో, ఆ లోకంలో వలెనే, ఆ బాధ కూడా నిష్కర్షగా ఒక స్వప్నమే. కాకపోతే, కలలో కలిగే ఆకలిని, కలలోని ఆహారంతోనే తృప్తి పరచాలి. మెలకువలో కలిగే ఆకలిని, మెలకువలోని ఆహారంతోనే తృప్తి పరచాలి. ఈ కల మెలకువ అనే వ్యవస్థలను కలపటానికి వీలు లేదు.
నీవు ఆత్మానుభూతిని పొంది ఉండి, ఈ మాయామయ దృశ్యమాన జగత్తు నుంచి మేల్కొనే వరకూ, నీ దృష్టికి వచ్చినపుడల్లా, బాధా నివారణ కల్గించటం ద్వారా  నీవు సమాజ సేవ తప్పక చేయ వలసిందే. నేను కదా చేస్తున్నాను అనే భావం లేకుండా, నేను భగవంతుని చేతిలో పరికరాన్ని అని భావించాలి. నా కంటే తక్కువ లేదా హీన స్థితిలో ఉన్న వాడికి సహాయం చేస్తున్నాననే భావన రాకూడదు. వానిలోని భగవంతునికి అర్పించేందుకు ఒక మార్గంగా వాడికి నీవు సాయపడాలి.అటువంటి సేవ అంతా ఆత్మను సేవించటమే. ఇతరులకేవ్వరికీ సహాయం చేయటం లేదు. నీకు నీవే చేసుకుంటున్నావు. వాస్తవానికి సహాయం చెయ్యటానికి ‘ఇతరులు’ అంటూ ఎవరూ లేరు. స్వర్ణకారుడు ఆభారణాలలోని బంగారాన్ని చూస్తున్నట్లుగానే, ఆత్మజ్ఞుడు ఆత్మను మాత్రమే చూస్తుంటాడు.
నిరాశ  – జ్ఞానము
నిరాశయే జ్ఞానము. నిరాశ వేరు, జ్ఞానము వేరు కాదు. నిజమున రెండూ ఒక్కటే. నిరాశ అనగా ఒక్క విషయము వైపునకు మనసు పోకుoడు ట . జ్ఞానమనగా ఒక్క విషయము తోచకుoడుట.
నిద్ర – చావు
రెండు జాగ్రదావస్థల మధ్య ఉండేది నిద్ర. రెండు పుట్టుకల మధ్య ఉండేది చావు. రెండూ అశాశ్వతమైనవే. జీవాత్మ అశరీర స్థితి లోనికి రాదు. దాని శరీరాలు మారుతుంటాయి. స్థూల శరీరమే కాకపోవచ్చు. సుషుప్తిలోను, స్వప్నం లోను, లేక పగటి కలలలోను సంభవించే విధంగా అది సూక్ష్మశరీరమైనా కావచ్చు.
అసలైన నేను, నేను నేనైన నేను (I AM THAT I AM) మూర్తి త్రయం  (ఫాదర్, సన్, హోలిఘోస్ట్) అను క్రైస్తవ సిద్ధాంతం.
తండ్రి అయిన భగవంతుడు ఈశ్వరునకు,
కుమారుడైన భగవంతుడు గురువుకు,
పరిశుద్దాత్మ అయిన భగవంతుడు ఆత్మకు – సమానం అనే ప్రకటనలో వేదాంత సారం ఉంది.
“ఈశ్వరో గురురార్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణా మూర్తయే నమః” అంటే భగవంతుడు తన భక్తునికి గురువు రూపంలో కన్పించి , పరిశుద్ధాత్మ అంతర్యామియై ఉన్నదనీ  బోధిస్తాడు. అంటే భగవంతుడు చైతన్యమనీ, ఈ చైతన్యం సర్వే సర్వత్రా అంతర్భూతమై ఉన్నదనీ, ఆత్మను తెలుసుకోవలసి ఉన్నదనీ, ఈ ఆత్మజ్ఞాన సిద్దియే భగవత్సాక్షాత్కారమనీ అర్ధం .
సర్వోన్నత శక్తి అయిన ఆత్మ ఒకటి ఉన్నదనీ, దానికి దారి చూపేందుకు మాత్రమే గ్రంధాలు ఉపకరిస్తాయనీ మనం తెలుసుకోవాలి.
మూలమైనది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. అదే భగవంతుడు. ఆత్మను తెలుసుకోవడం భగవంతుని తెలుసుకోవడమే. నిజానికి భగవంతుడు, ఆత్మ కంటే వేరు కాదు.
ఈశ్వరుడు వేరు, నేను వేరు అను భావన కoటే , ఈశ్వరుడే నేను అను అభిన్న భావన పావనమైనది.

దేహము జడము. అది నేను కాదు. ‘నేనేవ్వడు’ అని వెదికి చూసిన అట్టి వారి హృదయాంతరంగ మందు పరిపూర్ణు డైన ‘అరుణాచల శివుడు’ ‘అహం’ స్ఫురణ రూపుడై స్వయముగా ప్రకాశిస్తూ ఉంటాడు.